కోల్కతా: ఒక ఐఏఎస్ అధికారిణిని బీజేపీ టార్గెట్ చేసింది. దీంతో గవర్నర్ కార్యాలయం నుంచి ఆమెను బదిలీ చేశారు. ఓటమి పరాభవంతో బీజేపీ రగిలిపోతున్న పశ్చిమ బెంగాల్లో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రానికి కొత్తగా నియమితులైన గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ఇటీవల సీఎం మమతా బెనర్జీతో సత్సంబంధాలు కొనసాగించారు. సెయింట్ జేవియర్స్ విశ్వవిద్యాలయంలో ప్రసంగం సందర్భంగా సీఎం మమతను ఆయన పొగిడారు. అలాగే రాష్ట్ర అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడిన సందర్భంలో కూడా సీఎం మమతా బెనర్జీని గవర్నర్ బోస్ ప్రశంసించారు.
కాగా, టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ సత్సంబంధాలు కొనసాగించడంపై బీజేపీ కలత చెందింది. గత గవర్నర్, ప్రస్తుత ఉప రాష్ట్రపతి జగదీప్ ధంకర్ మాదిరిగా సీఎం మమతా బెనర్జీతో ఆయన కయ్యాలకు దిగకపోవడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతున్నది. గవర్నర్ ఆనంద్ బోస్ను ఆయన కార్యాలయం ప్రధాన కార్యదర్శి నందిని చక్రవర్తి తప్పుదోవ పట్టిస్తున్నారని ఆ పార్టీ ఆరోపించింది. రాజ్భవన్లో రాష్ట్ర ప్రభుత్వ ఎజెండాను ఆమె నడుపుతున్నారని బెంగాల్ బీజేపీ క్యాడర్ విమర్శించింది.
ఈ నేపథ్యంలో ఐఏఎస్ అధికారిణి నందిని చక్రవర్తిని గవర్నర్ కార్యాలయం నుంచి తొలగించాలని చాలా రోజులుగా బీజేపీ డిమాండ్ చేస్తున్నది. దీని కోసం బీజేపీ అధిష్ఠానంపై కూడా ఒత్తిడి పెంచింది. ఇందులో భాగంగా గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ను బెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ శనివారం కలిశారు. ఐఏఎస్ అధికారిణి నందిని చక్రవర్తిపై పలు ఆరోపణలు చేశారు. ఆమెను గవర్నర్ కార్యాలయం నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్, రాజ్భవన్లో కొత్త అధికార బృందాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ప్రిన్సిపల్ సెక్రటరీ నందిని చక్రవర్తిని రాజ్భవన్ నుంచి బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆమెను ఆ విధుల నుంచి తొలగించాలని ఆదివారం లేఖ రాశారు. దీంతో ఐఏఎస్ అధికారిణి నందిని చక్రవర్తిని పర్యటక శాఖకు బదిలీ చేశారు. బెంగాల్ హోంమంత్రిత్వ శాఖ ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెను పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా గవర్నర్ నియమించినట్లు అందులో పేర్కొంది.