కోల్కతా: మొన్న ముకుల్ రాయ్, నిన్న బాబుల్ సుప్రియో, నేడు అర్జున్ సింగ్.. ఇలా కీలక నేతలందరూ బెంగాల్ బీజేపీని ఒక్కొక్కరుగా వీడుతున్నారు. దీంతో రాష్ట్రంలో ఆ పార్టీ అంతకంతకూ బలహీనపడుతున్నది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ నుంచి వలసలు క్రమంగా పెరిగినట్టు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
బెంగాల్ బీజేపీని కీలక నేతలు వీడిపోవడానికి గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ప్రధాన కారణమని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లోని 42 స్థానాలకు గానూ 40 శాతం ఓట్ షేర్తో బీజేపీ 18 సీట్లను గెలిచి టీఎంసీకి (22 సీట్లు గెలిచింది) గట్టిపోటీ ఇచ్చింది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడం ఖాయమని అనుకొన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్రశ్రేణి నేతలు బెంగాల్లోనే మకాం పెట్టడంతో ఇక కమలదళానికి ఎదురులేదని భావించారు. దీంతో ఎన్నికల ముందు పలు పార్టీల నేతలు బీజేపీలోకి క్యూ కట్టారు. అయితే మమత మ్యాజిక్ ముందు బీజేపీ వెలవెలపోయింది. ఎన్నికల్లో 294 స్థానాలకు గానూ 77 సీట్లనే బీజేపీ గెలుచుకొన్నది. దీంతో వాస్తవం అందరికీ బోధపడింది. ఈ క్రమంలోనే పలువురు నేతలు సొంతగూటికి చేరుకొంటున్నారు. కీలక నేతల వలసలతో బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ బలం 77 నుంచి 70కి పడిపోయింది.
అంతర్గత కుమ్ములాటలు..
బీజేపీ బెంగాల్ యూనిట్ బలపేతానికి కారణమైన సయంతన్ బసు, ప్రతాప్ బెనర్జీ, జాయ్ ప్రకాశ్ మజుందార్ వంటి కీలక నేతలను తప్పించి అనుభవంలేని వారికి పార్టీ పగ్గాలు అప్పగించడమే బీజేపీ ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. కొత్త నాయకులు ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలతో జిల్లా, మండల్, బూత్ స్థాయిలోని నేతలు అసంతృప్తితో ఉన్నట్టు పేర్కొంటున్నారు. వ్యవస్థీకృత లోపాలు, కిందిస్థాయి కార్యకర్తలతో సమన్వయలేమి, అంతర్గత కుమ్ములాటలు, పార్టీ యూనిట్ అవినీతికి అడ్డాగా మారడం, అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవ్వడంతో నానాటికీ పార్టీ తీసికట్టుగా మారుతున్నది.
ఆ సోయి లేదు
బీజేపీ బెంగాల్ యూనిట్ ఏసీ ఆఫీసుల్లో కూర్చొని పనిచేస్తుంది. ట్విట్టర్, ఫేస్బుక్లో పోస్టులు పెడుతూ కాలం వెళ్లదీయడమే తప్ప, క్షేత్రస్థాయిలో ప్రజలు, కార్యకర్తల సమస్యలపై వారికి సోయి లేదు. అధిష్ఠానం పంపే నిధులను కూడా ఇక్కడి యూనిట్ దుర్వినియోగం చేస్తున్నది. పెద్దమొత్తంలో అవినీతి పేరుకుపోయింది. అంతర్గతంగా బీజేపీ చాలా బలహీనమైంది. వ్యవస్థీకృత వైఫల్యాలు పెరిగిపోయాయి. మమతా బెనర్జీ సంస్థాగత నైపుణ్యాల ముందు కమలదళం ఏ మాత్రం నిలబడలేదు. అంతర్గత కుమ్ములాటలకే వారికి సమయం సరిపోవడంలేదు. ప్రత్యర్థులకు ఇక పోటీ ఎలా ఇస్తారు? నా కుమారుడు ఎమ్మెల్యే పవన్ సింగ్ కూడా త్వరలో బీజేపీలో నుంచి టీఎంసీలోకి వస్తాడు.
– ఇటీవల టీఎంసీలో చేరిన ఎంపీ అర్జున్ సింగ్
అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీని వీడిన కీలక నేతలు
ముకుల్ రాయ్, తన్మోయ్ ఘోష్, బిశ్వజిత్ దాస్, సౌమెన్ రాయ్, బాబుల్ సుప్రియో, కృష్ణ కళ్యాణి, రాజీబ్ బెనర్జీ, అర్జున్ సింగ్.
బెంగాల్ చరిత్ర, వారసత్వం, అక్కడి ప్రజల ఆచార, వ్యవహారాలపై బీజేపీకి ఏ మాత్రం అవగాహన లేదు. ప్రత్యర్థులపై రాజకీయ దాడులకు పాల్పడటం తప్ప ఆ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదు.
-బీజేపీ బెంగాల్ యూనిట్ మాజీ ఉపాధ్యక్షుడు చంద్రకుమార్ బోస్