కోల్కతా: బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడ్ని పార్టీ కార్యాలయంలోనే సొంత పార్టీ నేత కొట్టాడు. పశ్చిమ బెంగాల్లోని మిడ్నాపూర్లో ఈ సంఘటన జరిగింది. బీజేపీ మండల అధ్యక్షుడు ఠాకూర్ దాస్ మిద్దా శనివారం సాయంత్రం పార్టీ జిల్లా కార్యాలయానికి చేరుకున్నాడు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్ గుచ్చైత్ కూడా పార్టీ జెండాల కోసం అక్కడకు వెళ్లాడు. అయితే పార్టీ ఖర్చుల లెక్కల నివేదికలను అక్కడున్న వారు అడిగారు. ఈ సందర్భంగా ఠాకూర్, శంకర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహం చెందిన బీజేపీ మండల అధ్యక్షుడు ఠాకూర్ దాస్, జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్పై చేయి చేసుకుని కొట్టాడు. బీజేపీ కార్యాలయంలో ఉన్న మిగతా నేతలు జోక్యం చేసుకుని వారిద్దరికి సర్ది చెప్పారు.
కాగా, బీజేపీ జిల్లా కార్యాలయంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఈ వీడియో క్లిప్ను పార్టీ అధినేతలకు పంపినట్లు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్ తెలిపారు. మరోవైపు బీజేపీలోని అంతర్గత పోరు బయటపడిందని స్థానిక టీఎంసీ నేత అజిత్ విమర్శించారు. ఆ పార్టీ సంస్కృతి ఇదేనని ఆయన దుయ్యబట్టారు.