BJP | న్యూఢిల్లీ/కోల్కతా, మార్చి 3: లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన మరుసటి రోజే బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమబెంగాల్లోని అసన్సోల్ టికెట్ దక్కించుకొన్న బోజ్పురి గాయకుడు, నటుడు పవన్ సింగ్ ఎన్నికల బరిలో నిలిచేందుకు వెనుకడుగు వేశారు. తాను లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయలేనంటూ కమలం పార్టీకి షాక్ ఇచ్చారు. ఈ మేరకు పవన్ సింగ్ ఆదివారం తన ఎక్స్ ఖాతాల్లో పోస్టు చేశారు. టికెట్ ఇచ్చినందుకు బీజేపీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు చెప్పిన ఆయన.. ‘కొన్ని కారణాల’ వల్ల పోటీచేయలేనని పేర్కొన్నారు. అయితే పోటీకి నిరాకరణపై పవన్ సింగ్ స్పష్టమైన కారణాలు వెల్లడించలేదు. పవన్ సింగ్ పోటీ నుంచి తప్పుకోవడంపై టీఎంసీ వ్యంగ్యాస్ర్తాలు సంధించింది. కనీసం ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించకుండా బీజేపీ అసన్సోల్ స్థానాన్ని వదులుకొన్నదని ఎద్దేవా చేసింది. ప్రస్తుతం అసన్సోల్ లోక్సభ స్థానం నుంచి టీఎంసీ నేత శత్రుఘ్న సిన్హా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
బీజేపీ మొదటి జాబితాలో టికెట్ నిరాకరణకు గురైన ఢిల్లీలోని ఛాందిని చౌక్ సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్ రాజకీయాలకు గుడ్బై చెప్పారు. 30 ఏండ్ల రాజకీయ ప్రస్థానం తర్వాత తాను మళ్లీ తన మూలాలకు వెళ్లాలని అనుకొంటున్నట్టు హర్షవర్ధన్ ఆదివారం పేర్కొన్నారు. టొబాకో, పర్యావరణ మార్పులు వ్యతిరేకంగా తన పనిని కొనసాగిస్తానని తెలిపారు. మరోవైపు గుజరాత్లోని మెహసానా లోక్సభ స్థానానికి బీజేపీ పార్టీ తరపున అభ్యర్థిత్వం పోటీ నుంచి తప్పుకొంటున్నట్టు మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ ప్రకటించారు. రాష్ట్రంలోని 26 స్థానాలకుగానూ బీజేపీ 15 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయగా.. మెహసానా స్థానానికి ప్రకటించలేదు.
బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాలో కొన్ని తప్పులు దొర్లాయి. అస్సాంలో జరిగిన డీలిమిటేషన్ను పరిగణనలోకి తీసుకోకుండా.. పలు స్థానాలకు పాత నియోజకవర్గాల పేర్లతోనే అభ్యర్థులను ప్రకటించారు. దీంతో అస్సాం అభ్యర్థుల సవరణ జాబితాను బీజేపీ ఆదివారం విడుదల చేసింది. శనివారం లిస్టులో పేర్కొన్న మంగళ్దాయ్, కలియాబోర్ స్థానాలు ప్రస్తుతం లోక్సభ నియోజకవర్గాలుగా లేవు. కొత్త లిస్టులో వీటిని దర్రాంగ్ ఉదల్గిరి, కజిరంగాగా మార్చారు. మొదలి లిస్టు ప్రకారం అభ్యర్థి రంజిత్ దుత్తా పోటీచేస్తున్న స్థానం తేజ్పూర్ను సోనిత్పూర్గా సవరించారు. ఇక నౌంగోగ్ను నాగావ్గా, అటానమస్ డిస్ట్రిక్ట్ను డిఫుగా మార్చారు.
195 మంది అభ్యర్థుల తొలి జాబితాలో బీజేపీ 33 మంది సిట్టింగ్ ఎంపీల స్థానంలో కొత్త ముఖాలను బరిలోకి దింపింది. మధ్యప్రదేశ్లో ఏడు, రాజస్థాన్, గుజరాత్, అస్సాం, ఢిల్లీల్లో ఐదు స్థానాల చొప్పున, ఛత్తీస్గఢ్లో నాలుగు, త్రిపుర, పశ్చిమబెంగాల్లో ఒక్క స్థానం చొప్పున సిట్టింగ్ ఎంపీలను మార్చింది. న్యూఢిల్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖికి హ్యాండిచ్చిన బీజేపీ.. ఆ సీటును సుస్మాస్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్కు కేటాయించింది. పార్లమెంట్లో బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దక్షిణ ఢిల్లీ ఎంపీ రమేశ్ బిధూరిని పోటీ నుంచి తప్పించింది. గుజరాత్లో మూడు సార్లు ఎంపీగా గెలిచిన కిరీట్ సోలంకి సీటు అహ్మదాబాద్(వెస్టు)ను కిదార్భాయ్ మక్వానాకు ఇచ్చారు. పోరుబందర్ స్థానం నుంచి కేంద్ర మంత్రి మన్షుక్ మాండవీయను బరిలోకి దింపారు. మధ్యప్రదేశ్లో గుణ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ క్రిష్ణపాల్ సింగ్ను తప్పించి.. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు కేటాయించారు.
ప్రధాని మోదీ ఆదివారం బీజేపీకి పార్టీ ఫండ్గా రూ.2 వేలు విరాళం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ నమో యాప్ ద్వారా ఈ విరాళాల కార్యక్రమంలో పాలుపంచుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఈనెల 1న ‘డొనేషన్ ఫర్ నేషనల్ బిల్డింగ్’ క్యాంపెయిన్ను ప్రారంభించింది.
బీజేపీ తొలి జాబితాలో అత్యంత సీనియర్ నేత, పార్టీకి విధేయుడిగా ఉన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరు లేకపోవడంపై శివసేన(యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మోదీ, అమిత్షా పేర్లను ముందుగానే ప్రకటించుకోవడాన్ని ఆయన ప్రస్తావించారు. వీరిద్దరి కంటే తాము గడ్కరీ పేరే పార్టీలో ముందుగా విన్నామని అన్నారు. ఇదే సమయంలో అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న కృపాశంకర్ సింగ్ పేరును మొదటి లిస్టులో ప్రకటించారని ఠాక్రే విమర్శించారు.