జైపూర్: Rajasthan Man |చనిపోయాడని అందరూ అనుకున్నారు. కానీ.. 33 ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. అందరూ షాక్!.. దీంతో ఆ పెద్ద మనిషిని చూసి కుటుంబ సభ్యులు షాక్ కావడంతోపాటు సంతోషం పట్టలేకపోయారు. రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం 75 ఏళ్ల వయసున్న హనుమాన్ సైనీ ( Hanuman Saini) 33 ఏళ్ల కిందట ఢిల్లీలోని ఖారీ బావోలిలో పని చేశాడు. అయితే 1989లో హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. సుమారు 42 ఏళ్ల వయసులో కనిపించకుండా పోయిన అతడ్ని వెతికేందుకు కుటుంబ సభ్యులు అన్ని ప్రయత్నాలు చేశారు.
పోలీసులకు ఫిర్యాదు చేసినా హనుమాన్ సైనీని ఆచూకీ తెలియలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆశలు వదులుకున్నారు. సైనీ చనిపోయి ఉంటాడని భావించారు. ఆయన పేరుతో ఉన్న భూమికి సంబంధించిన వ్యవహారాలపై సమస్యలు కూడా ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో 2022లో సైనీకి కర్మ కాండలు నిర్వహించారు. అలాగే కోర్టు ద్వారా మరణ ధృవీకరణ పత్రం కూడా పొందారు. ఐదుగురు సంతానమైన ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు పెద్దవారు కావడంతోపాటు వారందరికీ పెళ్లిళ్లు కూడా అయ్యాయి.
కాగా, ప్రస్తుతం 75 ఏళ్ల వృద్ధుడైన హనుమాన్ సైనీ మే 30న బన్సూర్ గ్రామంలోని తన ఇంటికి తిరిగి వచ్చాడు. చనిపోయాడని భావించిన వ్యక్తి 33 ఏళ్ల తర్వాత కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఆ షాక్ నుంచి తేరుకుని ఇంట్లోకి స్వాగతం పలికారు. ఈ విషయం తెలిసిన సైనీ సోదరులు, అతడి ముగ్గురు కుమార్తెలు తమ భర్తలు, పిల్లలతో కలిసి అత్తవారి ఇళ్ల నుంచి పుట్టింటికి వచ్చారు. అలాగే సైనీని చూసేందుకు స్థానికులు కూడా ఆ ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సైనీ తిరిగి రావడంతో వారంతా ఆశ్చర్యంతోపాటు ఆనందం వ్యక్తం చేశారు.
మరోవైపు సుమారు 33 ఏళ్లుగా తాను ఎక్కడ ఉన్నాడో అన్నది హనుమాన్ సైనీ వివరించాడు. దేవత పిలుపు మేరకు హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా మాత ఆలయానికి వెళ్లినట్లు తెలిపాడు. అక్కడకు వెళ్లేందుకు రైలు ఎక్కినప్పుడు తన జేబులో కేవలం రూ.20 మాత్రమే ఉన్నాయని చెప్పాడు. అయితే టీటీ తన పట్ల దయ చూపాడని, పఠాన్కోట్ వరకు ఉచితంగా టికెట్ ఇచ్చినట్లు తెలిపాడు. అక్కడి నుంచి కాంగ్రా మాతా ఆలయానికి చేరుకున్న తాను 33 ఏళ్లగా అమ్మవారి సేవలో తరలించినట్లు చెప్పాడు. కోల్కతాలోని గంగాసాగర్, కాళీ మాతా ఆలయాలను కూడా మధ్యలో సందర్శించినట్లు వెల్లడించాడు.
కాగా, ధ్యానం, ఆరాధన పూర్తి కావడంతో ఇంటికి తిరిగి వెళ్లమని దేవత తనను ఆదేశించిందని హనుమాన్ సైనీ తెలిపాడు. దీంతో మే 29న రైలులో ప్రయాణించి రాజస్థాన్లోని ఖైర్తాల్ ప్రాంతానికి చేరుకున్నట్లు చెప్పాడు. అక్కడి నుంచి కాలి నడకన తాతర్పూర్కు వెళ్లినట్లు తెలిపాడు. మే 30న కుటుంబం గురించి స్థానికులను అడగ్గా ఒక వ్యక్తి తనను గుర్తించి తన ఇంటికి తీసుకెళ్లినట్లు వెల్లడించాడు.