కగవాడ్ (కర్ణాటక), ఫిబ్రవరి 29: కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. తన భూమి కబ్జాపై ప్రశ్నించిన ఒక మహిళను వివస్త్రను చేసిన ఘటన బెళగావి జిల్లా కగ్వాడ గ్రామంలో జరిగింది. బాధితురాలి కుమార్తె ఫిర్యాదుతో ఏడు నెలల తర్వాత గురువారం విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన అప్పటి వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే ప్రభుత్వం ఒక మహిళకు ఇచ్చిన మూడెకరాల భూమిలోని 20 కుంటల భూమిని, రోడ్డు ప్రాంతాన్ని నిందితుడు ఆక్రమించుకున్నాడు. ఇదేమని ప్రశ్నించిన బాధితురాలిని గత ఏడాది జూలై 31న నిందితుడు వివస్త్రను చేసి అవమానపరిచాడు. ఆమె కుమారుడిని దారుణంగా కొట్టాడు. అదనపు ఎస్పీ శ్రుతి ఆధ్వర్యంలో పోలీసులు గ్రామానికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. కగ్వాడ్ తహశీల్దార్ బాధితురాలి వాంగ్మూలం తీసుకున్నారు. వివాదాస్పద భూమిపై సర్వే నిర్వహించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు.