న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ నేపథ్యంలో (India Pakistan ceasefire) ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. అయితే పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ చేపట్టిన సైనిక దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సుమారు వంద గంటల పాటు డ్రోన్, క్షిపణి దాడులు జరిగాయి. మే 7 తెల్లవారుజామున 1 గంట సమయంలో ‘ఆపరేషన్ సిందూర్’తో వైమానిక దాడులను భారత్ ప్రారంభించింది. పాకిస్థాన్తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని 9 ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేశాయి. త్రివిధ దళాలు చేపట్టిన ఈ దాడుల్లో సుమారు వంద మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
కాగా, మే 7న భారత్ జరిపిన దాడులపై పాక్ ప్రతిస్పందించింది. మే 7 అర్ధరాత్రి నుంచి మే 8 గురువారం తెల్లజాము వరకు సరిహద్దుల్లో కాల్పులతోపాటు 15 నగరాలపై డ్రోన్లు, క్షిపణులతో పాక్ దాడులకు పాల్పడింది. అయితే ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో పాక్ డ్రోన్లు, క్షిపణులను భారత్ కూల్చివేసింది.
మరోవైపు మే 8 రాత్రి నుంచి మే 9 శుక్రవారం తెల్లవారుజాము వరకు జమ్ముకశ్మీర్తోపాటు రాజస్థాన్, పంజాబ్లోని 36 సరిహద్దు ప్రాంతాల్లో 300 నుంచి 400 టర్కీ డ్రోన్లను పాక్ ప్రయోగించింది. భారత్ సమర్థవంతంగా వీటిని నిర్వీర్యం చేసింది. పాక్ దాడులు మే 10 వరకు కొనసాగాయి. పంజాబ్లోని అమృత్సర్పై శనివారం ఉదయం 5 గంటలకు, రాజస్థాన్లోని జైసల్మేర్పై మధ్యాహ్నం 1 గంట వరకు డ్రోన్లతో పాక్ దాడులు చేయగా భారత సైన్యం తిప్పికొట్టింది.
ఇక మే10న పాక్లోని ఎయిర్ బేస్లతో సహా 8 కీలక సైనిక స్థావరాలను భారత యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. దీంతో భారత్ దాడుల ధాటికి పాక్ తోకముడిచింది. కాల్పుల విరమణ కోసం భారత్ ఆర్మీతో సంప్రదింపులు జరిపింది. భారత్ అంగీకారంతో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఇరు దేశాల మధ్య కాల్పుల విమరణ అమలులోకి వచ్చింది. అయితే మే 7 నుంచి 10 వరకు భారత్, పాకిస్థాన్ మధ్య సుమారు వంద గంటలపాటు డ్రోన్, క్షిపణి దాడులు జరిగాయని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.