న్యూఢిల్లీ, డిసెంబర్ 12: పన్ను ఎగవేతలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్డీఐ) నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘బీబీసీ ఇండియా’ సంచలన నిర్ణ యం తీసుకుంది. బీబీసీ ఇండియా స్థానంలో ‘కలెక్టివ్ న్యూస్రూమ్’ అనే పేరుతో సరికొత్త వార్తా ప్రసార సంస్థను ఏర్పాటుచేస్తున్నట్టు బ్రిటన్ ప్రభుత్వ రంగ సంస్థ ‘బీబీసీ’ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఈ ప్రకటన ప్రకారం, ‘బీబీసీ వరల్డ్ సర్వీస్ ఇండియా’ స్థానంలో ‘కలెక్టివ్ న్యూస్రూమ్’ అనే పేరుతో కొత్త సంస్థను ఏర్పాటుచేస్తున్నాం.
భారతీయు ల యాజమాన్యంలో ఈ సంస్థ నడుస్తుంది. వి దేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలకు అనుగుణంగా ఈ సంస్థ నిర్వహణ ఉంటుంది. ప్రస్తు తం బీబీసీ ఇండియా ఎడిటోరియల్, ప్రోగ్రాం మేకింగ్లో అనుభవజ్ఞులైన నలుగురు ఉద్యోగు లు ఆ సంస్థను వీడి, వారి నేతృత్వంలో కొత్త సంస్థ ఏర్పాటు అవుతున్నది’ అని బీబీసీ ఇండియా సీనియర్ న్యూస్ ఎడిటర్ రూపా ఝా ఒక ప్రకటన జారీచేశారు. 2002 గుజరాత్ అల్లర్లలో ఆనాటి సీఎంగా ఉన్న నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ విడుదల (ఈ ఏడాది జనవరిలో) చేయటం సంచలనం రేపింది.
దీనిపై మోదీ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదంతా కూడా భారత్లోని బీబీసీ కార్యాలయాల్లో ఐటీ, ఈడీ సోదాలకు దారితీసింది. ఆ తర్వాత ఐటీ, ఎఫ్డీఐ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుందని సంస్థపై ఆరోపణలు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలుగు సహా ఆరు భాషల్లో బీబీసీ ఇండియా న్యూస్ కంటెంట్ను ప్రసారం చేస్తున్నది. దేశవ్యాప్తంగా ప్రతివారం సగటున 8.2 కోట్లమంది బీబీసీ ఇండియా ప్రసారాల్ని వీక్షిస్తున్నారని సంస్థ పేర్కొన్నది.