న్యూఢిల్లీ : పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య సామాన్యుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతున్నది. ఆర్బీఐ బుధవారం రెపోరేట్లను పెంచగా.. దేశంలో బ్యాంకులు వడ్డీ రేట్లను సైతం పెంచనున్నాయి. ఆర్బీఐ నిర్ణయం తర్వాత ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తుండగా.. దాని ప్రభావం ఇప్పుడే కనిపిస్తోందని పేర్కొంటున్నారు. ద్రవ్యోల్బణం సెగ మొన్నటి వరకు వంట గదిని తాకగా.. ఇప్పుడు బాత్రూమ్కు చేరింది. దేశంలో అతిపెద్ద ఎఫ్ఎంసీజీ కంపెనీ హిందూస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ సబ్బులు, షాంపూలు, ఇతర వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల ధరలను పెంచింది.
ఓ నివేదిక ప్రకారం కంపెనీ తన ఉత్పత్తుల ధరలను 15శాతం వరకు పెంచింది. కేవలం ఒక్క బాత్ సోప్లకే కాదూ టూత్పెట్, కెచప్ సహా ఇతర వస్తువుల ధరలను 4 నుంచి 13శాతం వరకు హెచ్యూఎల్ పెంచింది. గతంలో చమురు ధరల పెరుగుదల మధ్య ఎంఎంసీజీ ఉత్పత్తుల ధరలు పెరిగాయి. ఆ తర్వాత కంపెనీ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించగా.. ప్రస్తుతం క్లినిక్ ప్లస్ షాంపూ 100 మిల్లీమీటర్ల ప్యాక్ ధర 15శాతం పెరగ్గా.. ఇతర షాంపూల ధరలు పెరిగాయని డిస్ట్రిబ్యూటర్ వర్గాలు పేర్కొన్నట్లు నివేదిక తెలిపింది.
125 గ్రాముల పియర్స్ సోప్ ప్రస్తుతం 2.38 శాతం పెరిగి రూ.86 చేరిందని, ఇదే కాకుండా మల్టీప్యాక్పై 3.7శాతం వరకు పెరిగిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నారు. లక్స్ సోప్ మల్టీప్యాక్ ధరలను కంపెనీ నేరుగా తొమ్మిది శాతం వరకు పెంచింది. ఇంతే కాకుండా హిందూస్థాన్ యూనిలీవర్ సబ్బులు, షాంపూల ధరలను మాత్రమే కాకుండా కంపెనీ తయారు చేసే పలు ఉత్పత్తుల ధరలను సైతం పెంచింది. వీటిలో హార్లిక్స్, బ్రూ కాఫీ, కిసాన్ కెచప్ తదితర ఉత్పత్తుల ధరలను 4 నుంచి 13శాతం వరకు పెంచినట్లు నివేదిక పేర్కొంది.