బెంగళూరు: కర్ణాటక సీఎంగా బీఎస్ యెడియూరప్ప రాజీనామా చేయడంతో ఆయన వారసుడిగా ఎంపికైన బస్వరాజ్ ఎస్ బొమ్మై కూడా లింగాయత్ సామాజిక వర్గ నేతే. యెడియూరప్పకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన బస్వరాజ్ ఎస్ బొమ్ము.. గత క్యాబినెట్లో కీలక హోంశాఖ నిర్వహించారు. .
సోమవారం యెడియూరప్ప తన సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రాజకీయంగా పలుకుబడి గల లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన నేత యెడియూరప్ప. ఈ నేపథ్యంలో తదుపరి సీఎంగా లింగాయత్ నేతను ఎంపిక చేయడంలో బీజేపీ వ్యూహాత్మకంగానే వ్యవహరించినట్లు కనిపిస్తున్నది.
సదర లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బస్వరాజ్ ఎస్ బొమ్మై.. బీఎస్ యెడియూరప్పకు అత్యంత సన్నిహితుడు. ఇక జనతా పరివార్ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాష్ట్ర సీఎంగా 1988-89 మధ్య స్వల్ప కాలం పని చేసిన ఎస్ఆర్ బొమ్మై తనయుడే బస్వరాజ్ ఎస్ బొమ్మై.
బస్వరాజ్ ఎస్ బొమ్మై 2008లో బీజేపీలో చేరారు. నాటి నుంచి క్రమక్రమంగా పార్టీలో ఎదుగుతూ వచ్చారు. రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రిగానూ సేవలందించారు. రెండు సార్లు ఎమ్మెల్సీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇంజినీరింగ్ పూర్తి చేసి టాటా గ్రూప్లో కూడా పని చేశారు.
రాజీనామా చేసిన బీఎస్ యెడియూరప్ప.. వీరశైవ లింగాయత్ సామాజికవర్గ నేత. కర్ణాటకలో బీజేపీకి కీలక మద్దతు ఇస్తున్న సామాజిక వర్గం ఇదే. చారిత్రంగా కర్ణాటక పాలిటిక్స్ను లింగాయత్లే శాసిస్తున్నారు.
1956 నుంచి ఇప్పటి వరకు పని చేసిన 20 మంది సీఎంల్లో ఎనిమిది మంది లింగాయత్ సామాజిక వర్గ నేతలే. రాష్ట్రంలోని 223 అసెంబ్లీ సెగ్మెంట్లలో 140 చోట్ల లింగాయత్లది గణనీయ ప్రాతినిధ్యం ఉంది. 90 స్థానాల్లో అభ్యర్థుల విజయావకాశాలను నిర్దేశిస్తారు. రాష్ట్ర జనాభాలో 17 శాతం లింగాయత్లే.