గౌహతి: పోలీసులకు సహకరిస్తున్న ఇద్దరు క్యాడర్లను నిషేధిత యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం -ఇండిపెండెంట్ (ఉల్ఫా-ఐ) చంపేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అస్సాంలోని బార్పేటకు చెందిన ధంజిత్ దాస్, బైహతా చైరాలికి చెందిన సంజీవ్ శర్మ పోలీసుల కోసం గూఢచర్యం చేశారని ఆ తీవ్రవాద సంస్థ ఆరోపించింది. మార్చిలో ఉల్ఫా-ఐ క్యాడర్లో కొత్తగా చేరిన 30 ఏళ్ల ధంజిత్ దాస్ కొత్త క్యాడర్లతో కలిసి పోలీసులకు లొంగిపోయేందుకు ఏప్రిల్ 24న క్యాంప్ నుంచి పారిపోయినట్లు తెలిపింది. మరునాడు అతడ్ని ఉల్ఫా-ఐ పట్టుకున్నదని చెప్పింది. దర్యాప్తులో తన తప్పును అంగీకరించాడని పేర్కొంది. మే 4న ప్రజాకోర్టులో విచారణ జరిపి మరణశిక్ష విధించడంతో మే 7న దానిని అమలు చేసినట్లు వెల్లడించింది.
అలాగే 18 ఏండ్ల సంజీవ్ శర్మ డబ్బుల ఆశతో పోలీసుల సూచనతో మార్చిలో ఉల్ఫా-ఐలో కొత్తగా చేరాడని ఆ తీవ్రవాద సంస్థ తెలిపింది. అనంతరం ఆధునిక సాంకేతిక ద్వారా అంతర్గత సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నాడని ఆరోపించింది. మే 5న నిర్వహించిన ప్రజాకోర్టులో అతడు తన తప్పును ఒప్పుకున్నాడని తెలిపింది. దీంతో మరణశిక్ష విధించడంతో మే 7న దానిని అమలు చేసినట్లు పేర్కొంది. తమ తప్పును ఒప్పుకున్నట్లుగా వీరిద్దరు మాట్లాడిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.
మరోవైపు ఉల్ఫా-ఐ మరణశిక్ష అమలు చేసిన ఇద్దరు క్యాడర్ల కుటుంబ సభ్యులు ఈ విషయం తెలిసి ఆందోళన చెందారు. కాగా, అస్సాం పోలీసులు దీనిపై స్పందించలేదు. అయితే ఈ ఏడాది అస్సాంకు చెందిన 234 మంది తమ ఇళ్లను, ఉద్యోగాలను వీడి ఉల్ఫా-ఐలో చేరినట్లు తెలుస్తున్నది.