Banke Bihari Temple | బృందావనంలోని ఠాకూర్ బాంకే బిహారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి భారీగా భక్తులు తరలివచ్చి రాధాకృష్ణులను దర్శించుకున్నారు. ఎండలను సైతం లెక్క చేయకుండా వచ్చి క్యూలైన్లలో బారులు తీరారు. ఎక్కడ చూసినా ఆలయ దారులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. సుమారు 500 మీటర్ల వరకు భక్తులు క్యూకట్టారు. ఎండలో వృద్ధులు, మహిళా భక్తులు రద్దీతో ఇబ్బందులకు గురయ్యారు.
విద్యాపీఠ్ చౌరస్తా నుంచి బాంకే బిహారీ మందిర్ చేరుకోవడానికి గంటకుపైగా పట్టింది. ఆలయం కూడా భక్తుల రద్దీతో నిండిపోయింది. వివిధ ప్రాంతాల్లో మోహరించిన పోలీసులు క్యూలైన్లను క్రమబద్దీకరించారు. భారీగా భక్తులు తరలిరావడంతో వారిని అదుపు చేయడం కష్టంగా మారింది. పోలీసులు, ఆలయ సెక్యూరిటీ గార్డులు సైతం ఎండ, ఉక్కపోతతో తడిసిపోయారు. అయితే, ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తుండడంతో ఆలయ నిర్వాహకులు మార్గదర్శకాలు జారీ చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు రద్దీ సమయాల్లో ఆలయానికి రావొద్దని సూచించింది.