Hadi killers : బంగ్లాదేశ్ (Bangladesh) ను కుదిపేసిన విద్యార్థి ఉద్యమ నేత ఉస్మాన్ బిన్ హాదీ (Osman Hadi) హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు భారత్కు పారిపోయినట్లు బంగ్లాదేశ్ పోలీసులు ఆరోపించారు. ఈ మేరకు అధికారికంగా ఒక ప్రకటన చేశారు. ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు (DMP) ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
ప్రధాన నిందితులు ఫైసల్ కరీం మసూద్, అలంగీర్ షేక్లు మేఘాలయలోని తురా నగరంలో తలదాచుకున్నట్లు గుర్తించామని అదనపు పోలీస్ కమిషనర్ నజ్రుల్ ఇస్లాం తెలిపారు. సహచరుల సాయంతో వారు హలువాఘాట్ సరిహద్దు ద్వారా మేఘాలయలోకి ప్రవేశించారని చెప్పారు. అక్కడ వారికి ‘పూర్తీ, ‘సమి’ అనే ఇద్దరు వ్యక్తులు ఆశ్రయం కల్పించారని, వారిని భారత భద్రతాదళాలు అదుపులోకి తీసుకున్నట్లు తమకు అనధికారిక సమాచారం ఉందని పేర్కొన్నారు.
నిందితులను అరెస్ట్ చేసి తమకు అప్పగించాలని అధికారిక, అనధికారిక మార్గాల ద్వారా భారత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. గత ఏడాది జూలై-ఆగస్టులో జరిగిన విద్యార్థి ఉద్యమంలో హాదీ కీలకపాత్ర పోషించారు. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వ పతనానికి ఈ ఉద్యమమే కారణమైంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 12న ఢాకాలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా, రిక్షాలో వెళుతున్న హాదీపై దుండగులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు.
తీవ్రంగా గాయపడిన హాదీ సింగపూర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 18న కన్నుమూశారు. ఈ హత్య కేసులో ఇప్పటివరకు 11 మందిని అరెస్ట్ చేశామని, వారిలో ఆరుగురు నేరాన్ని అంగీకరించారని పోలీసులు తెలిపారు. వారం పది రోజుల్లో కేసుకు సంబంధించి ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని చెప్పారు.