న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: పండ్ల తొక్కల నుంచి సింగపూర్ శాస్త్రవేత్తలు బ్యాక్టీరియాలను నిరోధించే బ్యాండేజీలను తయారు చేస్తున్నారు. వీటి తయారీ కోసం సింగపూర్లోని నన్యాంగ్ వర్సిటీ శాస్త్రవేత్తలు పండ్ల తొక్కలను ఎండబెట్టి వాటి నుంచి సెల్యులోజ్ పొడిని వేరు చేశారు. దీనిని గ్లిజరాల్తో కలిపారు. ఆ మిశ్రమం జెల్(చిక్కని ద్రవ పదార్థం)లాగా మారుతుంది. దీనిని చిన్న చిన్నగా కట్ చేసి బ్యాండేజీల్లో వాడతారు. గాయం వేగంగా మానడంలో ఈ జెల్ దోహదం చేస్తుంది. గాయం వద్ద తేమగా ఉండటం వల్ల తొలగించడం కూడా సులువే. నొప్పి లేకుండా తొలగించవచ్చు. వ్యర్థాలను పునర్వినియోగించడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.