బెంగళూరు : కర్నాటకలో హిజాబ్ ధరించడాన్ని ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని కర్నాటక హైకోర్టు సమర్థించగా.. తీర్పును సవాల్ చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపగా.. ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం కేసు ఇంకా పెండింగ్లో ఉన్నందున పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్పై నిషేధం యథావిధిగా కొనసాగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు వెలువడినా.. దాన్ని స్వాగతిస్తామన్నారు. అయితే, తాము మెరుగైన తీర్పును ఆశిస్తున్నామని.. ప్రపంచవ్యాప్తంగా మహిళలు హిజాబ్, బురఖా వద్దని డిమాండ్ చేస్తున్నారన్నారు.
ఇదిలా ఉండగా.. కర్నాటక హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో దాఖలైన అప్పీళ్లపై జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ దూళియా బెంచ్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ అంశంపై ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలను వెల్లడించారు. కర్నాటక సర్కారు ఆదేశాలను జస్టిస్ హేమంత్ గుప్తా స్వాగతించగా.. సుదాన్షు దూళియా మాత్రం ప్రభుత్వ ఆదేశాలను కొట్టిపారేశారు. ఈ కేసులో భిన్నాభిప్రాయాలున్నాయని, అందుకే అప్పీళ్లను డిస్మిస్ చేస్తున్నట్లు జస్టిస్ హేమంత్ గుప్తా పేర్కొన్నారు. జస్టిస్ సుదాన్షు దూళియా అప్పీళ్లను ఆమోదిస్తూ.. కర్నాటక ప్రభుత్వ ఆదేశాలను రద్దు చేశారు. బాలికలకు విద్య అందించడమే తనకు ప్రాముఖ్యమైన విషయమని, హిజాబ్ను నిషేధించడం వల్ల వారి జీవితాలు బాగుపడుతాయా? అని జస్టిస్ దూళియా ప్రశ్నించారు. ఇద్దరు న్యాయమూర్తుల భిన్నాభిప్రాయాల నేపథ్యంలో కేసును చీఫ్ జస్టిస్.. లేదంటే విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయనున్నట్లు తెలుస్తున్నది.