ఖాట్మాండు: భారత్కు చెందిన 27 ఏళ్ల బల్జీత్ కౌర్ అరుదైన ఘనత సాధించింది. రెండు వారాల తేడాలోనే ఆమె నేపాల్లో ఉన్న రెండు అత్యంత ఎత్తైన శిఖరాలను అధిరోహించింది. పర్వతారోహకురాలైన బల్జీత్ కౌర్ .. 8వేల మీటర్ల ఎత్తైన రెండు పర్వతాలను ఎక్కింది. మౌంట్ కాంచనగంగ(8,586మీ), మౌంట్ అన్నపూర్ణ(8,091మీ) పర్వతాలను ఆమె అధిరోహించారు. బల్జీత్ కౌర్ స్వస్థలం హిమాచల్ ప్రదేశ్. గురువారం ఉదయం తెల్లవారుజామున 4.20 నిమిషాలకు కాంచనగంగ పర్వతాన్ని ఎక్కారు. ఈ విషయాన్ని నేపాలీ షెర్పా పాసాంగ్ తెలిపారు. ఏప్రిల్ 28వ తేదీన అన్నపూర్ణ పర్వతాన్ని ఆమె అధిరోహించారు. ఇక ఈ నెలలోనే బల్జీత్ కౌర్ ప్రపంచలోనే అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ను ఆమె ఎక్కనున్నారు. గడిచిన వారం మహారాష్ట్రకు చెందిన ప్రియాంకా మెహితా 8 వేల మీటర్ల ఎత్తైన అయిదు శిఖరాలను ఎక్కిన విషయం తెలిసిందే.