ముంబై: మహారాష్ట్రలో శివసేన రెండు వర్గాల మధ్య వైరం కొనసాగుతున్నది. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే పదో వర్ధంతి సందర్భంగా ఇది మరోసారి బయటపడింది. శివసేన రెబల్ వర్గానికి చెందిన సీఎం ఏక్నాథ్ షిండే బుధవారం బాలాసాహెబ్ ఠాక్రే సమాధిని సందర్శించి నివాళి అర్పించారు. అనంతరం అక్కడకు చేరిన శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం కార్యకర్తలు, నేతలు అక్కడంతా శుద్ధి చేశారు. బాల్ ఠాక్రే మెమోరియల్ ప్రాంగణం, ఆయన సమాధిపై నీరు, గోమూత్రం చల్లి శుద్ధి చేశారు.
కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో సీఎం ఏక్నాథ్ షిండే వర్గం దీనిని ఖండించింది. శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే ఎవరో ఒక వ్యక్తికి లేదా ఒక పార్టీకి చెందినవారు కాదని శివసేన రెబల్ వర్గం ప్రతినిధి దీపక్ కేసర్కర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ, ప్రతీ పార్టీ ఆయనను గౌరవిస్తుందని అన్నారు.