ముంబై: స్పోర్ట్స్ కాంప్లెక్స్కి టిప్పు సుల్తాన్ పేరు పెట్టడంపై భజరంగ్ దళ్ కార్యకర్తలు నిరసన తెలిపారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఒక ప్రాంతంలో నిర్మిస్తున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్కు టిప్పు సుల్తాన్ పేరు పెట్టడాన్ని బజరంగ్ దళ్ వ్యతిరేకించింది. భారీగా బ్యానర్లు, జెండాలతో కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని నిరసన తెలిపారు. దీంతో ముంబై పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు బజరంగ్ దళ్ నిరసనను మహారాష్ట్ర మంత్రి అస్లాం షేక్ ఖండించారు. గత 70 ఏండ్లలో టిప్పు సుల్తాన్ పేరుపై ఎలాంటి వివాదం లేదని ఆయన అన్నారు. ఇవాళ బీజేపీ తన గూండాలను పంపి దేశాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నదని ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుపై రచ్చ సృష్టించి దేశం అభివృద్ధి చెందకుండా చేస్తున్నదని విమర్శించారు. పేర్ల విషయంలో మనం వివాదాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు.
స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ వారితో పోరాడి ప్రాణాలు కోల్పోయిన ఏకైక యోధుడు టిప్పు సుల్తాన్ అని ముంబై ఇంచార్జ్ మంత్రి అయిన అస్లాం షేక్ గుర్తు చేశారు. ఈ రోజు కార్యక్రమం ప్రాజెక్టుల ప్రారంభోత్సవం మాత్రమేనని అన్నారు. ప్రజల అభివృద్ధి గురించి మాట్లాడకుండా కేవలం ప్రాజెక్టు పేరుపైనే బీజేపీ ఎందుకు దృష్టి పెడుతోందని ఆయన ప్రశ్నించారు.