బెంగళూర్ : కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో భజరంగ్ దళ్ కార్యకర్త విగతజీవిగా కనిపించాడు. బంట్వాల్ తాలూకా నేత్రావతి నదిలో అతడి మృతదేహం లభ్యమైంది. మృతుడిని రాజేష్ (26)గా గుర్తించారు. నది వద్ద నిర్మానుష్య ప్రదేశంలో బైక్ పడిఉండటంతో స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు.
గాలింపు చర్యలు చేపట్టిన అనంతరం నదిలో నుంచి భజరంగ్ దళ్ కార్యకర్త మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిర్వహించేందుకు తరలించారు. భజరంగ్ దళ్ కార్యకర్త బలవన్మరణానికి పాల్పడ్డాడా లేక ఎవరైనా హత్య చేశారా అనే వివరాలను పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.