అహ్మదాబాద్: పలు మల్టీ నేషనల్ కంపెనీల షాపులు, షోరూమ్ల వద్ద బజరంగ్ దళ్ కార్యకర్తలు నిరసన చేశారు. ‘కశ్మీర్ సాలిడారిటీ డే’కు మద్దతుగా ఆయా సంస్థలు సోషల్ మీడియాలో చేసిన పోస్టులపై మండిపడ్డారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ ఘటన జరిగింది. నగరంలోని హ్యుందాయ్ మోటార్ కంపెనీ, కియా మోటార్స్ షోరూమ్లతోపాటు కేఎఫ్సీ, డొమినోస్, పిజ్జా హట్ ఫుడ్ అవుట్లెట్ల వద్ద బజరంగ్ దళ్ కార్యకర్తలు నిరసన తెలిపారు. భారత అనుకూల నినాదాలు చేశారు. కశ్మీర్ భారత్లో అంతర్భాగమని పేర్కొంటూ పోస్టర్లు అంటించారు. కశ్మీర్ భారత్లో అంతర్భాగమని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి క్షమాపణలు చెప్పాలని, అప్పుడే వారిని క్షమిస్తామని బజరంగ్ దళ్ ఉత్తర గుజరాత్ కన్వీనర్ జ్వలిత్ మెహతా అన్నారు.
కాగా, ప్రతి ఏటా ఫిబ్రవరి 5న ‘కశ్మీర్ సంఘీభావ దినోత్సవం’ లేదా ‘కశ్మీర్ డే’గా పాకిస్థాన్ పాటిస్తుంది. ఈ రోజును జాతీయ సెలవుగా ప్రకటిస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్లోని పలు మల్టీ నేషనల్ కంపెనీలు ‘కశ్మీర్ సాలిడారిటీ డే’కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టాయి. అయితే భారత్లోని హిందూ సంస్థలు దీనిపై మండిపడ్డాయి. జమ్ముకశ్మీర్ భారత్లో అంతర్భాగమంటూ నిరసనలు చేపడుతున్నాయి. పోస్టులు పెట్టిన హ్యుందాయ్ మోటార్స్, కియా మోటార్స్ షోరూమ్లతోపాటు కేఎఫ్సీ, డొమినోస్, పిజ్జా హట్ అవుట్లెట్ల వద్ద ఆందోళన చేస్తున్నాయి.