బెంగళూర్ : కర్ణాటకలోని మంగళూర్లో మైనారిటీ వర్గానికి చెందిన విద్యార్ధులు ప్రయాణిస్తున్న వాహనాన్ని బజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డగించి వారిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. విద్యార్ధులను వేధించిన ఘటనలో మంగళూర్ పోలీసులు ఐదుగురు బజరంగ్ దళ్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ప్రైవేట్ వైద్య కళాశాలలో చదువుతున్న ఆరుగురు విద్యార్ధులు మాల్పె బీచ్కు వెళ్లి తిరిగివస్తుండగా సురత్కల్ టోల్ గేట్ సమీపంలో బజరంగ్ దళ్ కార్యకర్తలు వారి వాహనాన్ని అడ్డుకున్నారు.
వాహనంలో మైనారిటీ వర్గానికి చెందిన విద్యార్ధులతో పాటు హిందూ యువతులు ఉన్నారా అని ఆరా తీశారు. వాహనంలో ప్రయాణిస్తున్న యువకులను వేధించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఘర్షణ జరుగుతున్న సమయంలో ఘటనా ప్రాంతానికి పోలీసులు చేరుకోవడంతో పరిస్ధితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటన అంతా కెమెరాలో రికార్డు చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనకు సంబంధించి బజరంగ్ దళ్ జిల్లా ప్రముఖ్ ప్రీతం శెట్టి, కార్యకర్తలు అర్షిత్, శ్రీనివాస్, రాకేష్, అభిషేక్లను అరెస్ట్ చేశారు.