డెహ్రాడూన్ : చార్ధాం యాత్రకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఉత్తరాఖండ్ సహా దేశవ్యాప్తంగా రుతుపవనాల రాకతో భారీ వర్షాల కారణంగా గత రెండు రోజులుగా బద్రీనాధ్ హైవేను మూసివేశారు. హైవేపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాలతో పాటు రుద్రప్రయాగ్ జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలోని సిరోబగడ్ వద్ద కొండచరియలు విరిగిపడటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.
దీంతో యాత్రికులకు తీవ్ర అసౌకర్యం వాటిల్లిండి. సిరోగాబాద్ రోడ్డుపై శిధిలాలను తొలగించేందుకు పీడబ్ల్యూడి విభాగం జేసీబీ యంత్రాలను రంగంలోకి దింపింది. రుద్రప్రయాగ్లో కుండపోత కేదార్నాధ్ ధాం యాత్రికులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కేదార్నాధ్ ధాంను సందర్శించే యాత్రికుల సంఖ్య పదివేల నుంచి మూడు వేలకు పడిపోయింది.
ప్రస్తుతం యాత్రికులు తమ గమ్యస్ధానానికి చేరుకునేలా ట్రాఫిక్ను అధికారులు దారి మళ్లించారు. వాతావరణ పరిస్ధితి అనుకూలించిన తర్వాత యాత్రను పునరుద్ధరిస్తారని అధికారులు చెబుతున్నారు.