కాసరగోడ్: మొసళ్లు ఎక్కువగా మాంసాహారాన్నే ఇష్టపడుతాయి. నీటి ఒడ్డున మాటువేసి దూపతో అటుగా వచ్చిన జంతువులపై దాడి చేస్తాయి. కానీ కాసరగోడ్లోని అనంతపుర సరస్సులో ఉండే మొసలి మాత్రం మాంసం ముట్టదు. పూర్తిగా శాఖాహారి. సరస్సులోగల అనంత పద్మనాభ స్వామి ఆలయానికి వచ్చే భక్తులు పెట్టే బెల్లం, బియ్యం లాంటి ప్రసాదాలు మాత్రమే తింటుంది.
ఆ మొసలి ఒకటి కాదు, రెండు కాదు దాదాపు 77 ఏండ్ల క్రితం కాసరగోడ్లోని అనంతపుర సరస్సులో కనిపించింది. 1945లో ఆ సరస్సులో ఉన్న ఓ మొసలిని బ్రిటిష్ సైనికుడు కాల్చిచంపగా.. ఆ తర్వాత కొన్ని రోజులకే ఈ మొసలి ప్రత్యక్షమైంది. అప్పటి నుంచి 70 ఏండ్లకుపైగా సరస్సులోనే ఉన్నా ఆలయానికి వచ్చే భక్తులు ఎవరికీ ఇంతవరకు కీడు చేయలేదు. ఆలయ నిర్వాహకులు కూడా దానికి బబియా అని నామకరణం చేసి బాగోగులు చూసుకున్నారు.
అయితే, బబియా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఆలయానికి వచ్చే భక్తులు పెట్టే ప్రసాదం తినేది. సరస్సులో ఆలయం చుట్టూ తిరిగేది. అప్పుడప్పుడు మెట్లపైకి వచ్చి సేదదీరేది. ఇలా భక్తులకు ఒక ప్రత్యేక ఆకర్షణగా మారిపోయింది. అయితే, 70 ఏండ్లు భక్తులకు కనువిందు చేసిన బబియా ఆదివారం సరస్సులోనే ప్రాణాలు కోల్పోయింది. అనారోగ్యం పాలైన బబియాకు వైద్యులు చికిత్స చేసినా ఫలితం దక్కలేదు.
కాగా, ఆలయ నిర్వాహకులు బబియాకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఆలయానికి సంబంధించిన మైదానంలోనే దాన్ని ఖననం చేశారు. బబియా మరణవార్త తెలిసి భక్తులు భారీగా ఆలయానికి చేరుకున్నారు. బబియాను కడసారి చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు.