న్యూఢిల్లీ, మే 23: అల్లోపతిని ‘పిచ్చి సైన్స్’ అంటూ యోగా గురువు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో ఆయన స్పందించారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారని ఆరోపించారు. తనకు వచ్చిన వాట్సాప్ సందేశాలను చదివానని, కానీ వాటిని తానే అన్నట్టుగా ఆపాదించి వీడియో విడుదల చేశారని వివరణ ఇచ్చారు. అల్లోపతి వైద్య విధానం, మందులపై రాందేవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేగడంతో వాటిని ఉపసంహరించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఆయనకు లేఖ రాసిన కొద్దిసేపటికే ఈ ప్రకటన వెలువడింది. దేశం కరోనాతో పోరాడుతున్న తరుణంలో వైద్య సిబ్బంది అహోరాత్రులు శ్రమిస్తున్నారని, రాందేవ్ వ్యాఖ్యలు వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని హర్షవర్ధన్ రాందేవ్కు రాసిన లేఖలో ఆక్షేపించారు. కొవిడ్-19 బారిన పడిన లక్షలాది మందిని వైద్యులు ప్రాణాలకు తెగించి కాపాడారని, అల్లోపతి మందులు కూడా కోట్లాది మందికి ప్రాణం పోశాయని పేర్కొన్నారు. రాందేవ్ వ్యాఖ్యలు వైద్య సిబ్బందితో పాటు దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని తెలిపారు.