జమ్ము, ఆగస్టు 6: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ అసమ్మతి నేతల్లో ఒకరైన గులాం నబీ ఆజాద్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. జమ్ముకశ్మీర్లో పార్టీ ప్రచార కమిటీ చైర్మన్గా నియమితులైన గంటల వ్యవధిలోనే ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. అలాగే జమ్ముకశ్మీర్ రాజకీయ వ్యవహారాల కమిటీ నుంచి కూడా తప్పుకున్నారు. ఈ ఏడాది చివరిలో జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నదన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్టీలో వివిధ కమిటీలు ఏర్పాటుచేశారు. ప్రచార కమిటీ చైర్మన్గా ఆజాద్ను నియమించారు. నియమించిన కాసేపటికే ఆయన రాజీనామా చేయడం గమనార్హం. పార్టీలో జీ23 నేతలుగా ముద్రపడ్డ అసమ్మతి నేతల్లో ఆజాద్ ముఖ్యుడు.