అయోధ్య, జనవరి 11: అయోధ్యకు వచ్చే భక్తులు రామాయణ కాలం నాటి సంఘటనలను చూసే ఉద్దేశంతో అయోధ్యలో రామాయణ ఆధ్యాత్మిక వనాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అయోధ్య మాస్టర్ ప్లాన్లో భాగంగా, రాముడు వనవానం చేసిన 14 ఏండ్ల కాలాన్ని గుర్తుచేసేలా సరయు నది ఒడ్డున ఈ వనాన్ని తీర్చిదిద్దినట్టు అధికారులు తెలిపారు.
బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి వస్తున్నారని వీహెచ్పీ అధ్యక్షుడు అలోక్ కుమార్ తెలిపారు. అయితే, మరో నేత మురళి మనోహర్ జోషి హాజరు అవుతారా? లేదా? అన్నదానిపై పూర్తి సమాచారం లేదని వెల్లడించారు.
అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయి నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే న్యూయార్క్ టైమ్స్ స్కేర్ వద్ద లైవ్ ప్రసారం కానుండగా, కాలిఫోర్నియా, వాషింగ్టన్, న్యూయార్క్, చికాగో, యూరోపియన్ దేశాలు, కెనడా నగరాల్లో ర్యాలీలు, లైవ్ షోలు ప్రసారం చేసే దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నెల 22న అయోధ్య గగనతలంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడనున్నది. అయోధ్య ఎయిర్పోర్టుకు భారీస్థాయిలో విమానాలు రానుండటంతో ఈ ప్రాంతమంతా బిజీగా మారనున్నది. వీవీఐపీలు, వీఐపీల రాక కోసం అయోధ్య ఎయిర్పోర్టుకు 200 వరకు అభ్యర్థనలు రాగా, 110 విమానాలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్టు అధికారులు వెల్లడించారు.
రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా వారణాసి బోటు నిర్వాహకులు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. వారణాసిలోని మొత్తం 84 గంగా ఘాట్లలో ఈ నెల 22న ఉచిత ప్రయాణం కల్పించనున్నట్టు ప్రకటించారు. గంగా నిషద్ రాజ్ సేవా ట్రస్ట్ సెక్రటరీ శంభు సాహ్ని మాట్లాడుతూ.. నిషద్ వర్గంతో శ్రీరాముడికి గొప్ప సంబంధం ఉన్నదని తెలిపారు. శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతమ్మ తల్లి అడవి గుండా ప్రయాణించే సందర్భంలో నిషద రాజు వారిని ఉచితంగా నది దాటించారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరగనున్నందున ఆ రోజు తాము కూడా ఉచితంగా బోటు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నట్టు పేర్కొన్నారు.
అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా 1,111 శంఖాలతో జయధ్వానం చేయనున్నారు. ఈ మేరకు యూపీ సాంస్కృతిక శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ స్థాయిలో ఒకేసారి శంఖారావాలు చేసిన సందర్భం గతంలో ఎన్నడూ లేదని అధికారులు తెలిపారు.