న్యూఢిల్లీ: ఓట్ల కోసం వెరైటీ వెరైటీ ఫీట్లు చేయడం కామన్. ఇప్పుడు యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనూ ఇలాంటి ఘటనే జరగబోతోంది. యూపీలో మహిళలను ఆకట్టుకునేందుకు .. బీజేపీ థీమ్ చీరలను డిజైన్ చేయించింది. ఆ చీరలపై ప్రధాని మోదీ, సీఎం యోగిల ఫోటోలు ఉన్నాయి. గుజరాత్లోని సూరత్లో ఆ చీరలను నేశారు. అయితే చీరలపై మోదీ, యోగి ఫోటోలు ఉన్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ చీరలపై బీజేపీ పార్టీ పువ్వు గుర్తు కూడా ఉన్నది. అంతేకాదు ఓ స్లోగన్ కూడా ఇచ్చారు. అయోధ్య థీమ్తో తయారైన ఆ చీరలను ఈస్ట్రన్, వెస్ట్రన్ యూపీలో ఉండే మహిళా ఓటర్లకు పంచిపెట్టనున్నారు. యూపీలో ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. మోదీ, యోగి ఫోటోలు ఉన్న చీరల వీడియోను అహ్మాదాబాద్ జర్నలిస్టు షేర్ చేసినట్లు తెలుస్తోంది. సుమారు వెయ్యి చీరలను ఓటర్లకు పంచనున్నారు. 2019 లోక్సభ ఎన్నికల సమయంలోనూ.. మోదీ బొమ్మ ఉన్న చీరలను తయారు చేశారు. వాటిని 1500కు ఒకటి చొప్పున అమ్మారు. జార్ఖండ్లో ఆ చీరలకు ఫుల్ డిమాండ్ వచ్చింది.