అయోధ్య, జూన్ 26: అయోధ్యలోని రామ మందిరం విరాళాల దుర్వినియోగం, గల్లంతు కేసులో సిట్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ప్రభావం మొదలైంది. ఆలయ నిర్వహణ చూసే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత ట్రస్ట్ట్ అధిపతి చంపత్ రాయ్, ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా తమ పదవులకు శుక్రవారం రాజీనామా చేశారు. నైతికత కారణాలను చూపుతూ వారిద్దరూ తమ పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సమాచార డైరెక్టర్ తెలిపారు. కోట్లాది మంది భక్తులను దిగ్భ్రాంతికి గురి చేసిన రామ మందిర విరాళాల వివాదం నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. బ్యాంకు అధికారులతో కుమ్మక్కైన ఆలయ సిబ్బంది నగదు, విలువైన కానుకలను దుర్వినియోగం చేసినట్లు సిట్ ప్రాథమిక నివేదిక తేల్చినట్లు సమాచారం. వీటన్నింటి విలువ రూ.7 కోట్ల విరాళాలు ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి.
నిధుల దుర్వినియోగం ఆరోపణలు వెల్లువెత్తిన నాటి నుంచి ప్రతిపక్షాల నుంచి తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్న ఏకైక వ్యక్తి చంపత్ రాయ్. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా ఆలయ నిధుల, విరాళాల పర్యవేక్షణ బాధ్యత ఆయనదే. ఆలయ విరాళాల దుర్వినియోగం కేసులో ఎఫ్ఐఆర్ నమోదై 8 మంది నిందితులను అరెస్టు చేసిన మరుసటి రోజే ఆయన రాజీనామా చేయడం గమనార్హం. మరోవైపు ఈ కేసులో రమాశంకర్ యాదవ్ అలియాస్ టిన్ను, అతని డ్రైవర్, మరో సన్నిహిత సహచరుడు అరెస్టు కావడంతో చంపత్ రాయ్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. అరెస్టయిన మిగిలిన ఏడుగురిలో హుండీ లెక్కింపు సిబ్బంది, ఒక రిటైర్డ్ బ్యాంకు అధికారి తదితరులు ఉన్నారు. అయితే, ఈ వివాదం చెలరేగినప్పటి నుండి అందరి దృష్టి చంపత్ రాయ్పైనే ఉంది.
విరాళాల చోరీ ఆరోపణలను రాయ్ మొదట్లో తోసిపుచ్చారు. కానీ ఆ తర్వాత యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణను స్వాగతించారు. అరెస్టయిన ఏడుగురిని నిందితులుగా పేర్కొంటూ సిట్ ఈ వారం ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వానికి తన ప్రాథమిక దర్యాప్తు నివేదికను సమర్పించింది. కాగా, ఈ కేసులో ప్రముఖ వ్యక్తులను రక్షిస్తున్నారంటూ విపక్షాల నుంచి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రాయ్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. రామ మందిర ఉద్యమంలో కీలక వ్యక్తిగా చాలా మందికి చంపత్ రాయ్ గుర్తుంటారు. వాస్తవానికి అవివాహితుడైన రాయ్ 1980ల నుంచే తన జీవితాన్ని ఈ ఉద్యమానికి అంకితం చేశారని ఆయన మద్దతుదారులు చెబుతుంటారు.
శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందచేసిన రూ.1 కోటి విరాళానికి తమ పార్టీకి ఇప్పటివరకు రసీదు అందలేదని శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ శుక్రవారం తెలిపారు. అంతేగాక ట్రస్టుకు విరాళంగా సమర్పించిన 25 కిలోలకు పైగా బరువున్న వెండి ఇటుకకు సంబంధించి కూడా పార్టీకి ఎటువంటి రసీదు అందలేదని ముంబైలో విలేకరుల సమావేశంలో ఆయన ఆరోపించారు. దుర్వినియోగం చేసిన నిధులను ఎంపీలు, ఎమ్మెల్యేల కొనుగోలుకు వాడుకున్నారని ఆయన ఆరోపించారు.
అయోధ్యలోని రామ మందిర నిధుల దుర్వినియోగం కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ని జ్యోతిర్మఠ్కు చెందిన స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి శుక్రవారం ప్రశ్నించారు. కేవలం కింది స్థాయి ఉద్యోగుల పేర్లనే ఇందులో నిందితులుగా చేర్చారని, నిధుల దుర్వినియోగానికి బాధ్యులైన వ్యక్తులను వదిలిపెట్టారని ఆయన ఆరోపించారు. రాజకీయ నాయకులు ఎంచుకున్న వ్యక్తులతో ట్రస్టును ఏర్పాటు చేశారని, సాధువులు, స్వామీజీలు, పూజారులను దూరం పెట్టారని స్వామీజీ ఆరోపించారు. బీజేపీది నకిలీ హిందుత్వగా ఆయన అభివర్ణించారు. బీజేపీ సభ్యులందరూ నకిలీ హిందువులని ఆరోపించారు.
అయోధ రామ మందిర నిధుల దుర్వినియోగం కేసులో సిట్ తన నివేదికను సమర్పించిన వెంటనే నిందితులపై పోలీసుల చర్యలు ప్రారంభమయ్యాయని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. నేరానికి పాల్పడినట్లు తేలితే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు అయోధ్యను అప్రతిష్ట పాల్జేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
విరాళాల కేసు చుట్టూ నెలకొన్న వివాదం సమాజ్వాది పార్టీ, కాంగ్రెస్ సృష్టించిన కుట్రలో భాగమని యూపీ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ ఆరోపించారు. బాబ్రీ మసీదు కోసం వసూలు చేసిన విరాళాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బాబ్రీ మసీదు కూడా విరాళాలు సేకరించిందని, బాబ్రీ మసీదు సేకరించిన విరాళాలు ఏమయ్యాయని ఎవరూ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. సమాజ్వాది పార్టీ, కాంగ్రెస్ ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు సనాతన ధర్మంపై దాడి చేస్తున్నాయని పాఠక్ ఆరోపించారు.
లెక్కింపు గదిలో కొట్టేసిన డబ్బులను నిందితులు ఎక్కువగా ఆలయ కాంప్లెక్స్లోని బాత్రూమ్ రహస్య ప్రదేశాల్లో దాచేవారని తేలింది. వారికి వీలు కుదిరినప్పుడు ఆ డబ్బును బయటకు తరలించేవారు. 2024 ఆలయం ప్రారంభమైనప్పటి నుంచే ఈ నగదు దొంగతనం జరుగుతున్నదని సిట్ గుర్తించింది. ఈ సంవత్సరం ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 మధ్యనే దాదాపు 70 దొంగతనాలు జరిగాయని సీసీ ఫుటేజీలు బయటపెట్టాయి. కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన ఎనిమిది మంది నిధుల లెక్కింపు సిబ్బంది. దాదాపు రూ.7 కోట్ల నుంచి రూ.7.75 కోట్ల దాకా విరాళాల్లో అవకతవకలు జరిగి ఉంటాయని సిట్ అనుమానిస్తోంది.