MP Lallu Singh | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ఎన్డీయే కూటమికి మూడోసారి అధికారాన్ని కట్టబెడితే, రాజ్యాంగాన్ని మార్చేస్తారంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు ఇటీవలి కాలంలో పెద్దయెత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, తాము అదేం చేయబోమని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే చెప్పుకొచ్చారు.
అంతేకాదు రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కూడా దాన్ని మార్చలేరని నొక్కిచెప్పారు. కానీ, మోదీ మాటలను కాదని ఆయన పార్టీకి చెందిన సీనియర్ నేతలే ‘రాజ్యాంగ మార్పు’ అంశాన్ని తరుచూ తెరమీదకు తీసుకొస్తున్నారు. ఎన్డీయే కూటమికి 2/3 మెజారిటీ ఇస్తే, తప్పకుండా రాజ్యాంగాన్ని తిరగరాస్తామంటూ పేర్కొంటున్నారు. ఇప్పుడు ఈ విషయం సర్వత్రా అందోళన కలిగిస్తున్నది.
ఇలా అయితేనే సాధ్యం
అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మిల్కీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో అయోధ్య సిట్టింగ్ ఎంపీ, బీజేపీ నేత లల్లూసింగ్ పాల్గొని మాట్లాడారు. ‘272 ఎంపీ సీట్లతో ప్రభుత్వాన్నైతే ఏర్పాటు చేయవచ్చు. అయితే, ఈ మెజారిటీతో రాజ్యాంగ సవరణలు కష్టం. రాజ్యాంగాన్ని మార్చాలన్నా.. లేక, కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలన్నా ఎన్డీయేకు 2/3 మెజారిటీ అవసరం’ అని అన్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవ్వడంతో దిద్దుబాటు చర్యలకు దిగిన లల్లూసింగ్.. తప్పుడు ఉద్దేశంతో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదంటూ చెప్పుకొచ్చారు.
రాజ్యాంగంలో మార్పులు జరగొచ్చు: అరుణ్ గోవిల్
రాజ్యాంగంలో మార్పులు జరుగొచ్చంటూ బీజేపీ నేత అరుణ్ గోవిల్ తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఎన్డీయే సర్కారు మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. ‘కాలానుగుణంగా రాజ్యాంగంలో మార్పులు జరిగాయి. మార్పు అనేది అభివృద్ధికి సంకేతం. ఇది ప్రతికూలాంశం కాదు. నాటికీ, నేటికీ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. రాజ్యాంగంలో మార్పులు జరగాలంటే ఒక వ్యక్తి అభిప్రాయంతో సాధ్యం కాదు. అందరి సమ్మతితో దాన్ని మార్చుకోవచ్చు’ అని పేర్కొన్నారు.
గతంలో వీళ్లు ఇలా..
రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయేకి 400కు పైగా సీట్లు ఇస్తే, హిందువులకు అనుకూలంగా రాజ్యాంగాన్ని మార్చేస్తామని గత నెలలో కర్వార్లో జరిగిన ఓ సభలో ఎంపీ అనంత్కుమార్ హెగ్డే అన్నారు. రాజ్యాంగ పీఠికలో ‘లౌకికవాదం’ అనే పదాన్ని కూడా తొలగిస్తామన్నారు. ‘హిందువులకు అనుకూలమైన రాజ్యాంగం రావాలంటే మోదీ నేతృత్వంలోని బీజేపీకి లోక్సభలో అధిక సీట్లు ఇవ్వాలి. బీజేపీకి లోక్సభ, రాజ్యసభలతో పాటు రాష్ర్టాల ప్రభుత్వాల్లో 2/3 వంతుల మెజార్టీ ఉండాలి’ అని పేర్కొన్నారు.
నాగ్పూర్ నుంచి పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి జ్యోతి మిర్దా కూడా ఈ నెల తొలివారంలో రాజ్యాంగ మార్పునకు సంబంధించి ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు. ‘దేశ ప్రయోజనాల కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం రాజ్యాంగంలో సవరణలు, దాన్ని మార్చడం అవసరం. ఇది జరుగాలంటే ఉభయ సభల్లో బీజేపీకి 2/3 వంతుల మెజార్టీ కావాలి’ అని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల వేళ బీజేపీ సీనియర్లు తరుచూ రాజ్యాంగ మార్పుపై వ్యాఖ్యలు చేస్తుండటం సామాన్యులతో పాటు బుద్ధిజీవులకు ఆందోళన కలిగిస్తున్నది.