Noida Hit & Run case : నోయిడాలో పాలు కొనుగోలు చేసేందుకు రోడ్డు మీదకు వచ్చిన 63 ఏళ్ల వృద్ధుడిని ఢీకొట్టిన కేసులో.. ప్రమాదానికి కారణమైన ఆడీ (AUDI) కారును పోలీసులు గుర్తించారు. స్థానికంగా ఉన్న 150 సీసీ కెమెరాలను జల్లెడపట్టి ప్రమాదానికి కారణమైన కారును గుర్తించిన పోలీసులు.. ఢిల్లీలోని కిద్వాయ్ నగర్ పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసి ఉన్న కారును సీజ్ చేశారు.
నోయిడా సెక్టార్ 53కి చెందిన 63 ఏండ్ల వృద్ధుడు జనక్ దేవ్ షా అదివారం ఉదయాన్నే పాలు కొనుక్కొచ్చేందుకు బయటికి వెళ్లాడు. అదే సమయంలో ఆడి కారు అతడిని ఢీకొట్టి వెళ్లింది. ఈ ఘటనలో దాదాపు 10 అడుగులకు పైగా పైకి ఎగిరిన వృద్ధుడు బలంగా కిందపడ్డాడు. దాంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి కారుతో సహా పారిపోయాడు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఏడు బృందాలను ఏర్పాటు చేసి కారు కోసం గాలించారు. నిందితుడు కారును కిద్వాయ్ పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసి పైనుంచి కవర్ కప్పి వెళ్లడంతో ఆ కారును గుర్తించడం ఆలస్యమైంది. ఎట్టకేలకు కారును గుర్తించిన పోలీసులు దాన్ని సీజ్ చేశారు. అయితే కారు నడిపిన వ్యక్తి కోసం ఇంకా గాలిస్తున్నారు. కారు నంబర్ ఆధారంగా వారి సెర్చింగ్ కొనసాగుతున్నది.