న్యూఢిల్లీ: పదో తరగతి విద్యార్థులు మొదటి ఎడిషన్ బోర్డ్ పరీక్షలకు హాజరు కావడం తప్పనిసరి అని సీబీఎస్ఈ సోమవారం స్పష్టం చేసింది. మొదటి ఎడిషన్లో కనీసం మూడు సబ్జెక్టుల పరీక్షలకు హాజరు కాని వారిని ‘ఎసెన్షియల్ రిపీట్’ విభాగంలో నమోదు చేస్తామని పేర్కొన్నది. ఈ నెల 17 నుంచి పదో తరగతి మొదటి బోర్డ్ పరీక్షలు ప్రారంభం అవుతున్న వేళ పలువురు విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సందేహాలను నివృత్తి చేస్తూ సీబీఎస్ఈ ఈ ప్రకటన చేసింది.
‘మొదటి బోర్డ్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన, అర్హత కలిగిన విద్యార్థులు తమ సామర్థ్యాన్ని(మార్కులను) మెరుగుపరుచుకోవడానికి ఏవైనా మూడు సబ్జెక్టుల్లో పరీక్షలు రాయడానికి అనుమతిస్తాం’ అని పరీక్షల కంట్రోలర్ సన్యం భరద్వాజ్ తెలిపారు. ‘ఎసెన్షియల్ రిపీట్’ విభాగంలో నమోదైన విద్యార్థులను మళ్లీ ఏడాది తర్వాతే ఫిబ్రవరిలో బోర్డ్ పరీక్షలు రాయడానికి అనుమతిస్తామని తెలిపింది.