న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని కేంద్రప్రభుత్వం భావిస్తున్నదా? ఇప్పటికే ఆ దిశగా తీవ్రమైన ప్రయత్నాలు చేసి సఫలం కాలేకపోయిందా? ఇప్పుడు ఒమిక్రాన్ కేసులను వంకగా చూపుతూ ఎన్నికల ప్రక్రియను కొంతకాలం వాయిదా వేయాలనుకుంటున్నదా? బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి శుక్రవారం చేసిన ట్వీట్ ఈ అనుమానాలను బలపరుస్తున్నది. ఒమిక్రాన్ పేరిట యూపీ ఎన్నికలను కేంద్రం వాయిదా వేయనున్నట్టు ఆయన జోస్యం చెప్పారు. ‘ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో లాక్డౌన్ విధిస్తున్నాం, యూపీ ఎన్నికలను వాయిదా వేస్తున్నామని ప్రకటనలు వస్తే ఆశ్చర్యపోకండి. ఎన్నికలు వాయిదా పడగానే యూపీలో రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. వచ్చే సెప్టెంబర్లో ఎన్నికలు నిర్వహిస్తారు. యూపీ ఎన్నికలను వాయిదా వేయాలని ఈ ఏడాది మొదట్లోనే ప్రయత్నించారు. కుదరలేదు. ఇప్పుడు ఒమిక్రాన్ పేరిట పరోక్షంగా వాయిదా వేసే ప్రక్రియను వచ్చే ఏడాది మొదట్లో అమలు చేయనున్నారు’ అని ట్వీట్ చేశారు.