ఇంఫాల్: మణిపూర్లో అమానుషం చోటుచేసుకున్నది. రాష్ట్రంలో చెలరేగిన అల్లర్ల మాటున మహిళలపై దారుణాలు జరుగుతున్నట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటన తాజాగా బయటపడింది. మే 4న కాంగ్పోక్పి జిల్లాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరితో అక్కడి మహిళలు తీవ్ర వ్యధను అనుభవించారు. ఓ వర్గం వారు ప్రత్యర్థి వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను వివస్త్రలను చేశారు. అనంతరం వారిని గ్రామ వీధుల్లో ఊరేగించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న వారి ఆర్తనాదాలను ఎవరూ పట్టించుకోకుండా వికృతంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ధోరణి కారణంగానే దారుణాలు జరుగుతున్నట్టు పలువురు మండిపడుతున్నారు. ఈ ఘటనను ఐటీఎల్ఎఫ్ తీవ్రంగా ఖండించింది. చురాచాంద్పూర్లో ఘటనను నిరసిస్తూ ఆందోళన నిర్వహించనున్నట్టు వెల్లడించింది.
మిలిటెంట్ల వద్ద 6 లక్షల బుల్లెట్లు
మిలిటెంట్ల చేతుల్లో ఇప్పటికీ 6 లక్షల బుల్లెట్లు, 3 వేలకు పైగా ఆయుధాలు ఉన్నట్టు భద్రతా దళాల సీనియర్ అధికారి తెలిపారు. 303 రైఫిల్స్, మీడియం మెషిన్ గన్స్, ఏకే అస్సాల్ట్ రైఫిల్స్ కార్బైన్స్, లైట్ మెషిన్ గన్స్ దోపిడీకి గురైనట్టు, అవి మిలిటెంట్ల వద్దే ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇంఫాల్లోని పోలీస్ శిక్షణ కేంద్రం నుంచి 4,537 ఆయుధాలు, 6.32 లక్షల పేలుడు పదార్థాలు దోపిడీకి గురయ్యాయని తెలిపారు. వాటిలో కొన్ని స్వాధీనం చేసుకోగా మిలిగినవి ఇప్పటికీ మిలిటెంట్ల చేతుల్లోనే ఉన్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, కాంగ్లే యావోల్, కంబా లుప్ తదితర నిషేధిత సంస్థలు మళ్లీ పుంజుకున్నాయని అధికారులు తెలిపారు. వీటిలో కొన్ని సంస్థలు మిలిటెంట్లకు సహకరిస్తున్నట్టు సమాచారం ఉందన్నారు. వాటి వల్ల భవిష్యత్తులోనూ ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.