జైపూర్: స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో దేశీయంగా అభివృద్ధి చేస్తున్న తేజస్ ఎల్సీఏ మార్క్ 1ఏ తొలి ఫైటర్ స్క్వాడ్రన్ను (Tejas Mark 1A Fighter Squadron) రాజస్థాన్లో ఏర్పాటు చేయనున్నారు. పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో ఉన్న బికనీర్ జిల్లాలోని నాల్ ఎయిర్ బేస్ వద్ద తేజస్ మార్క్ 1ఏ ఫైటర్ జెట్స్ను మోహరించాలని భారత వైమానిక దళం (ఐఏఎఫ్) యోచిస్తున్నది. ఎల్సీఏ మార్క్1 తేజస్ యుద్ధ విమానాల కంటే ఎల్సీఏ మార్క్1ఏ ఫైటర్స్ జెట్స్ చాలా అధునాతన సాంకేతికత, సరికొత్త స్వదేశీ రాడార్లు, ఏవియానిక్స్తో కూడి ఉన్నట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్లోని నాల్ ఎయిర్ బేస్లో ప్రస్తుతం ఉన్న రెండు మిగ్-21 బైసన్ స్క్వాడ్రన్లలో ఒకదానిని తేజస్ మార్క్ 1ఏ ఫైటర్ జెట్స్తో భర్తీ చేయనున్నట్లు వెల్లడించాయి.
కాగా, ఎల్సీఏ మార్క్1ఏ ఫైటర్ జెట్స్ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేస్తునట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. తొలి ఎల్సీఏ మార్క్1ఏ ఫైటర్ జెట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి మధ్య భారత వైమానిక దళానికి సరఫరా అవుతుందని చెప్పారు. ఇప్పటికే 83 ఫైటర్ జెట్స్ ఉత్పత్తిలో ఉన్నాయని, మరో 97 విమానాల ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం అనుమతించినట్లు వెల్లడించారు. 40 ఎల్సీఏ మార్క్ 1 తేజస్ యుద్ధ విమానాలతో పాటు, మొత్తం 220 ఎల్సీఏ మార్క్ 1, ఎల్సీఏ మార్క్1 ఏ ఫైటర్ జెట్స్ను రానున్న 8 నుంచి పదేళ్లలో వినియోగంలోకి తీసుకువచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు. దీంతో పాతకాలం నాటి మిగ్ సిరీస్ యుద్ధ విమానాలను తేజస్ ఫైటర్ జెట్స్తో ఐఏఎఫ్ భర్తీ చేస్తుందని పేర్కొన్నారు.