Rajnath Singh | ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సభలో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు చేదు అనుభవం ఎదురైంది. ఉత్తరప్రదేశ్లోని గోండాలో జరిగిన సభలో మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడేందుకు మైక్ దగ్గరకు రాగానే నిశ్శబ్ధంగా ఉన్న కొందరు వ్యక్తులు ఒక్కసారిగా నిరసనకు దిగారు. ఆర్మీలో నియామకాలు చేపట్టాలని నినాదాలు చేశారు. ‘ఆర్మీలో నియామకాలు చేపట్టండి. మా డిమాండ్లు నెరవేర్చండి’ అని నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి కొద్దిసేపు ఆందోళనకరంగా మారింది.
రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. నియామకాలు చేపడతామని చింతించొద్దని హామీ ఇచ్చారు. ‘మీ బాధలు మా బాధలే. కరోనా వైరస్ వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. చింతించొద్దు అన్నీ జరుగుతాయి’ అని పేర్కొన్నారు. రాజ్నాథ్ సింగ్ హామీతో శాంతించిన నిరుద్యోగులు ‘భారత్ మాతాకీ జై’ అని నినదించారు. దీంతో అక్కడి పరిస్థితులు సద్దుమణిగాయి.