స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, జనవరి 30(నమస్తే తెలంగాణ): వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాది 9 రాష్ర్టాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి కీలకం కానున్నాయి. వీటిలో నాలుగు ఈశాన్య రాష్ర్టాలే ఉండగా, నాగాల్యాండ్, త్రిపుర, మేఘాలయ రాష్ర్టాలకు వచ్చే నెల 16 నుంచి 27 వరకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సెమీ ఫైనల్గా భావిస్తున్నది. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావాలని ఆశపడుతున్న బీజేపీ ఈశాన్య రాష్ర్టాల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది.
మోదీ హయాంలోనే బీజేపీ ఈశాన్య భారతంలో మొదటిసారి పాగా వేసింది. తొలుత అరుణాచల్ప్రదేశ్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని గవర్నర్ సహాయంతో లొంగదీసుకోవడం ద్వారా ఈశాన్య రాష్ర్టాలలో కాలుమోపింది. ఇదే వ్యూహాన్ని ఇతర రాష్ర్టాలలో కూడా అమలు చేసింది. ఎన్డీయేకు ప్రతిరూపమైన నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్ఈడీఏ) ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలతో జతకట్టి ఒక్కొక్క రాష్ర్టాన్ని హస్తగతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి అక్కడి మూడు రాష్ర్టాలకు అసెంబ్లీ ఎన్నికలు రావడంతో తన ఉనికిని సుస్థిరం చేసుకొనేందుకు వ్యూహం పన్నుతున్నది. కానీ ఈసారి అదంత సులభం కాకపోవచ్చని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.
మేఘాలయ
60 మంది సభ్యులున్న మేఘాలయ అసెంబ్లీకి ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగనున్నాయి. గత ఎన్నికలలో హంగ్ అసెంబ్లీ ఏర్పడటంతో దొడ్డిదారిన బీజేపీ గవర్నర్ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ముకుల్ సంగ్మా నేతృత్వంలోని కాంగ్రెస్ 21 సీట్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ కేంద్రం డైరెక్షన్లో, 19 సీట్లు గెలుచుకున్న నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ సమయం ఇచ్చారు. ఇతర చిన్నా చితక పార్టీలతో బేరసారాలు జరిపేందుకు సహకరించారు. దీంతో యూడీఎఫ్, పీడీపీ, హెచ్ఎస్డీపీ వంటి అన్ని ప్రాంతీయ పార్టీలతో కలిసి 31 మంది సభ్యుల మద్దతుతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.
వాస్తవానికి ఇక్కడ కేవలం రెండు సీట్లు మాత్రమే బీజేపీ గెలిచినప్పటికీ క్రిస్టియన్ ఓటర్లు అధికంగా ఉన్న మేఘాలయలో దొడ్డిదారిన బీజేపీ అధికారాన్ని చేపట్టగలిగింది. కానీ రాబోయే ఎన్నికల్లో బీజేపీకి గడ్డు పరిస్థితి తప్పదని స్థానిక పరిణామాలు సూచిస్తున్నాయి. సంకీర్ణ కూటమిలోని ఇతర పార్టీలతో బీజేపీకి సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎన్పీపీతో అసలు పొసగడం లేదు. బీజేపీ బలపడటం తమకు ప్రమాదకరమని ఎన్పీపీ నేతలు భావిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెర్నాడ్ ఆర్ మారాక్ను గత జూలైలో వ్యభిచార గృహాన్ని నడుపుతున్నారనే ఆరోపణపై అరెస్టు చేసారు. సీఎం కాన్రాడ్ సంగ్మాకు, మారాక్కు పడటం లేదన్నది బహిరంగ రహస్యమే. ఈసారి కూడా రాష్ట్రంలోని అన్ని పార్టీలు విడివిడిగానే బరిలోకి దిగుతున్నాయి. దీంతో ఎన్నికలకు ముందు బీజేపీతో ఎవరూ జతకట్టే పరిస్థితులు కనిపించడం లేదు.
త్రిపుర
త్రిపురలో గత ఎన్నికల్లో బీజేపీ 36 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. దేబ్బర్మ నేతృత్వంలోని ఐపీఎఫ్టీతో పొత్తు వల్లనే బీజేపీకి గెలుపు సాధ్యమైంది. అక్కడ 20 ఏండ్లపాటు ఏకధాటిగా సాగిన సీపీఎం పాలనపై వ్యతిరేకత, గిరిజనులకు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్న ఐపీఎఫ్టీతో పొత్తు బీజేపీకి కలిసొచ్చింది. అయితే గెలుపు అనంతరం ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ను బీజేపీ అటకెక్కించింది. దీంతో త్రిపుర రాజకుటుంబానికి చెందిన ప్రద్యోత్ దేబ్బర్మ.. టిప్రా మోతా పేరిట పార్టీ ఏర్పాటుచేసి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ను నెత్తికెత్తుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం విషయంలో కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు బీజేపీ సాహసించకపోవడంతో ఒంటరిగానే బరిలోకి దిగుతున్నారు. ఈ యన పార్టీ ప్రభావం గిరిజనులు అత్యధికంగా ఉన్న 20 స్థానాలపై ఉండవచ్చని భావిస్తున్నారు. సీఎం బిప్లబ్ కుమార్ను బీజేపీ గత మే నెలలో గద్దె దించి మాణిక్ సాహాను ఆ స్థానంలో కూర్చోబెట్టింది. కానీ అప్పటికే బీజేపీకి జరగాల్సిన నష్టం జరిగిపోయిందని పరిశీలకులు అంటున్నారు.
నాగాల్యాండ్
మేఘాలయ మాదిరిగానే నాగాల్యాండ్లో కూడా ప్రభుత్వాన్ని బీజేపీ వెనుకనుంచి నడిపిస్తున్నది. ఈ సారి ఎలాగైనా గట్టెక్కేందుకు కొత్తగా ఏర్పడిన నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీపై ఆధారపడుతున్నది. గత ఎన్నికల సమయంలో నాగా పీపుల్స్ ఫ్రంట్ అగ్రనాయకత్వంపై అపనమ్మకంతో ఉన్న సీఎం నెఫియూ రియో బీజేపీ సహాయంతో ఎన్డీపీపీని ఏర్పాటుచేశారు. అంతకుముందు రియో ఎన్పీఎఫ్ తరఫున సీఎం కాగా, బీజేపీ దానికి మిత్రపక్షంగా ఉండేది. వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీపీపీలు మరోసారి పొత్తుతో వస్తున్నాయి. పొత్తు పేరిట ప్రాంతీయ పార్టీతో జతకట్టడం, ఆ తర్వాత ఆ పార్టీ నాయకుడిని చేరదీయడం, ఆపై ఆ పార్టీని నామరూపాలు లేకుండా బీజేపీ అనుసరిస్తున్న కుతంత్రం. మహారాష్ట్రలో శివసేన, అస్సాంలో ఏజీపీ ఈ విధంగానే దెబ్బతిన్నాయి. ఈ భయం ప్రస్తుతం నెఫియూ రియోను వెంటాడుతున్నది. .