న్యూఢిల్లీ: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సతీమణిపై కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా చేసిన ఆరోపణలు రాజకీయంగా సంచలనంగా మారాయి. ఈ ఆరోపణలకు సంబంధించి నమోదైన కేసులో పవన్ ఖేరాను ప్రశ్నించేందుకు అస్సాం పోలీసులు మంగళవారం సెంట్రల్ ఢిల్లీలోని ఆయన ఇంట్లో సోదాలు చేపట్టారు. దీనిపై అస్సాం పోలీస్ అధికారి డీసీపీ దెబోజిత్ నాథ్ విలేకర్లతో మాట్లాడుతూ, సోదాల్లో నేరారోపణలకు సంబంధించి కొన్ని సాక్ష్యాలు లభించాయని, వాటి వివరాలు ఇప్పుడే వెల్లడించలేమని ఆయన చెప్పారు. ఆయన్ని ప్రశ్నించేందుకు రాగా.. ఇంట్లో పవన్ ఖేరా కనిపించలేదని, కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. పోలీసుల సోదాల్ని.. కక్ష సాధింపు చర్యగా కాంగ్రెస్ పేర్కొన్నది. పోలీసుల సోదాల నేపథ్యంలో పవన్ ఖేరా హైదరాబాద్కు పారిపోయారని హిమంత బిశ్వశర్మ ఎద్దేవా చేశారు. పాతాళలోకంలో ఉన్నా పోలీసులు అతడిని పట్టుకుంటారని పేర్కొన్నారు.