Himanta Biswa Sarma | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: కేంద్ర ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు.. బీజేపీ నేతలకు, వారి అనుచరులకు కనకవర్షం కురిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి తాజా ఉదంతం అస్సాంలో బయటపడింది. ‘పీఎం కిసాన్ సంపద యోజన’ పథకం ద్వారా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భూయాన్ శర్మకు చెందిన కంపెనీకి రూ.10 కోట్లు అందాయి. కేంద్ర ఆహార శాఖ వెబ్సైట్లోనే దీనికి సంబంధించిన సమాచారం వెలువడింది. సంపద యోజన పథకం కింద సబ్సిడీతో కూడిన రుణం రూ.10 కోట్లు రినికి భూయాన్ శర్మకు చెందిన ‘ప్రైడ్ ఈస్ట్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి’ కంపెనీ అందుకున్నట్టు వెబ్సైట్ పేర్కొన్నది. ఈ వ్యవహారం అస్సాంలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నది.
‘పీఎం కిసాన్ సంపద యోజన బీజేపీ నేతల్ని మరింత ధనవంతుల్ని చేసేందుకా? అని ప్రతిపక్షాలు అధికార బీజేపీని ప్రశ్నిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలు సామాన్య రైతులకా? బీజేపీ నేతల కోసమా? అని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అస్సాం సీఎం కుటుంబ సభ్యులపై అక్కడి న్యూస్ వెబ్ పోర్టల్స్ ఇటీవల మరో సంచలన వార్తా కథనం వెలువరించాయి. నాగోన్ జిల్లా డారిగాజి గ్రామంలో 30 ఎకరాల వ్యవసాయ భూమిని పారిశ్రామిక భూమిగా అధికారులు వర్గీకరించారు. ఇది జరిగిన నెల రోజుల్లోనే సీఎం హిమంత బిశ్వ శర్మ కుటుంబ సభ్యులు ఆ భూమిని కొనుగోలు చేయటం సంచలనం రేపింది. ఈ వ్యవహారంపై న్యాయ విచారణ జరపాలంటూ గువాహటి హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. అయితే ఈ ఆరోపణల్ని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఖండిస్తున్నారు. ‘పీఎం కిసాన్ సంపద యోజన’ ద్వారా తన భార్యకు, ఆమెకు చెందిన కంపెనీకి ఎలాంటి నిధులు మంజూరు కాలేదని వివరణ ఇచ్చారు.
‘పీఎం కిసాన్ సంపద యోజన’ పథకం ముఖ్య ఉద్దేశం వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా చైన్లో ఆధునిక మౌలిక వసతుల కల్పన. ఇందుకోసం సబ్సిడీతో కూడిన రుణాల్ని కేంద్ర ఆహార ప్రాసెసింగ్ శాఖ లబ్దిదారులకు అందజేస్తున్నది. అయితే క్షేత్రస్థాయిలో దీని అమలు తీరు అనుమానాల్ని రేకెత్తిస్తున్నది. సీఎం భార్యకు చెందిన కంపెనీకి రూ.10 కోట్లు ఎలా ఇస్తారని ఆరోపణలు వచ్చాయి. ‘ఇంత పెద్దమొత్తంలో గ్రాంట్ను ఎవరు విడుదల చేశారు? బీజేపీకి చెందిన ఇతర నేతలకు కూడా ఇలాగే అందుతున్నదా? రైతుల ఆదాయం రెట్టింపు చేయటమంటే ఇదేనా?’ అని కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ ప్రశ్నించారు.