(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): అశోక యూనివర్సిటీ అర్థశాస్త్ర సహాయ ప్రొఫెసర్ సబ్యసాచి దాస్కు ఆ వర్సిటీకి చెందిన మరో నాలుగు విభాగాలు సంఘీభావం తెలిపాయి. సబ్యసాచి రాజీనామాను వర్సిటీ యాజమాన్యం అంగీకరించడాన్ని సదరు డిపార్ట్మెంట్ల అధ్యాపకులు తప్పుబట్టారు. సబ్యసాచిని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులో తిరిగి నియమించాలని, అంతవరకూ తాము బోధనలను నిలిపేస్తున్నట్టు వెల్లడించారు.
ఈ మేరకు వర్సిటీకి చెందిన సోషియాలజీ అండ్ ఆంథ్రోపాలజీ, ఇంగ్లిష్, క్రియేటివ్ రైటింగ్, పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లు వేర్వేరుగా ప్రకటనలను విడుదల చేశాయి. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అక్రమంగా అధిక సీట్లను గెల్చుకుందని తన అకడమిక్ పేపర్లో సబ్యసాచి ఆరోపించారు. అనంతరం సబ్యసాచి తన పోస్టుకు రాజీనామా చేశారు. దానిని యూనివర్సిటీ అంగీకరించింది. దీంతో బాలకృష్ణన్ అనే మరో ప్రొఫెసర్ రాజీనామా చేశారు.