న్యూఢిల్లీ/జైపూర్, సెప్టెంబర్ 26: రాజస్థాన్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తున్నది. తాజా పరిణామాల నేపథ్యంలో అధ్యక్ష పదవికి అశోక్ గెహ్లాట్ పోటీపై అనిశ్చితి నెలకొన్నది. అధ్యక్ష పదవికి గెహ్లాట్ పోటీ నేపథ్యంలో రాజస్థాన్ తదుపరి సీఎంగా సచిన్ పైలట్ను అధిష్టానం దాదాపు ఖరారు చేయడాన్ని వ్యతిరేకిస్తూ గెహ్లాట్ వర్గానికి చెందిన 90 మందికి పైగా ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధపడిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల పట్ల సోనియాగాంధీ అసంతృప్తిగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్లో రాజకీయ సంక్షోభానికి ముగింపు పలికేందుకు అధ్యక్ష పోటీ నుంచి గెహ్లాట్ను తప్పించే యోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు సీడబ్ల్యూసీ సభ్యుల నుంచి కూడా డిమాండ్లు వస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ సీనియర్ ఒకరు మాట్లాడుతూ ‘కాంగ్రెస్ అధ్యక్ష రేసు నుంచి గెహ్లాట్ తప్పుకుంటారు. ఈనెల 30 లోగా ఇతర నేతలు నామినేషన్లు దాఖలు చేస్తారు’ అని పేర్కొన్నారు. అధ్యక్ష రేసులో కొత్తగా ముకుల్ వాస్నిక్, మల్లిఖార్జున ఖర్గే, దిగ్విజయ్ సింగ్, కేసీ వేణుగోపాల్ పేర్లు వినిపిస్తున్నాయి.
సోనియాతో సీనియర్ల భేటీ
రాజస్థాన్ కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకులు అజయ్ మాకెన్, ఖర్గే సోమవారం ఢిల్లీలో సోనియాతో సమావేశమయ్యారు. రాజస్థాన్ రాజకీయ పరిణామాలపై వారు ఆమెకు వివరించారు. ఖర్గే, మాకెన్ మంగళవారం సోనియాకు రాతపూర్వక నివేదిక ఇవ్వనున్నారు. గెహ్లాట్ మద్దతు ఎమ్మెల్యేలు క్రమశిక్షణారాహిత్యంగా వ్యవహరించారని మాకెన్ అన్నారు. రాజస్థాన్ పరిణామాలను చక్కదిద్దేందుకు పార్టీ సీనియర్ నేత కమల్నాథ్ను రంగంలోకి దించనున్నట్టు సమాచారం.