న్యూఢిల్లీ: రాజస్థాన్లో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రచేసిందని ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. 2020లో సచిన్ పైలట్ తిరుగుబాటు వెనుక కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హస్తముందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సచిన్ పైలట్ వైపు మళ్లేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఒక్కొక్కరికి రూ.10 కోట్లు ఇచ్చారని, కొందరికి రూ.5 కోట్లు ముట్టజెప్పారని ఆరోపించారు. ఢిల్లీలో పైలట్తో అమిత్షాతోపాటు పలువురు బీజేపీ పెద్దలు సమావేశమయ్యారని చెప్పారు.
ఇందుకు సంబంధించి తన వద్ద పక్కా ఆధారాలున్నాయని గెహ్లాట్ వెల్లడించారు. పైలట్ నమ్మకద్రోహి అని.. అతడిని ముఖ్యమంత్రిని చేయలేమని వ్యాఖ్యానించారు. సీఎం గెహ్లాట్ గురువారం ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి తన సొంత సర్కారును పడగొట్టేందుకు ప్రతిపక్షంతో సచిన్ పైలట్ చేతులు కలిపాడని, దేశ చరిత్రలోనే ఇలాంటి ఘటన ఎక్కడా జరుగలేదన్నారు. 102 మంది ఎమ్మెల్యేలలో ఎవరిని సీఎం చేసినా ఫర్వాలేదని, సచిన్ పైలట్లాంటి నమ్మకద్రోహిని మాత్రం ముఖ్యమంత్రిని చేస్తే ఊరుకోబోమన్నారు.