న్యూఢిల్లీ: డీలిమిటేషన్ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు అని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టంచేశారు. డీలిమిటేషన్ బిల్లుపై గురువారం పార్లమెంట్లో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగంలో పొందుపర్చిన ప్రజాస్వామ్యం, ఫెడరలిజానికి ఈ బిల్లు పూర్తి విరుద్ధమని మండిపడ్డారు. డీలిమిటేషన్ ఫ్రీజ్ను తొలగించడం ద్వారా తక్కువ జనాభా ఉన్న రాష్ర్టాలకు దక్కాల్సిన న్యాయమైన వాటాను ఈ బిల్లు కాలరాస్తున్నదని దుయ్యబట్టారు. దక్షిణాది రాష్ర్టాలను ఎప్పటికీ ఇతర రాష్ర్టాలే పరిపాలించాలనే కుట్ర ఈ బిల్లు వెనుక దాగి ఉన్నదని విమర్శించారు.
చట్టసభల్లో ఓబీసీ, ముస్లింల ప్రాతినిధ్యాన్ని తగ్గించేలా బిల్లు ఉన్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. జనాభా ప్రాతిపదికన లోక్సభ, శాసనసభల్లో సీట్లు పెంచితే ఎక్కువ జనాభా ఉన్న రాష్ర్టాలకే మరిన్ని అధికారాలు ఇచ్చినట్టు కాదా? అని ప్రశ్నించారు. చిన్న రాష్ర్టాలు తమ గొంతు వినిపించే హక్కు కోల్పోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. హిందీ మాట్లాడే రాష్ర్టాలకు ఇప్పటికే 38.1% ప్రాతినిధ్యం ఉండగా.. డీలిమిటేషన్తో 43.1 శాతానికి చేరుతుంది. దక్షిణాది రాష్ర్టాలకు 24% ఉన్న ప్రాతినిధ్యం 20 శాతానికి పడిపోతుందని వివరించారు. ‘బిల్లు ప్రవేశపెట్టడానికి ఏడు రోజుల ముందు సభ్యులకు కేంద్ర మంత్రి నోటీసులు ఇవ్వాలి. బిల్లు కాపీలను రెండు రోజుల ముందు ఇవ్వాలి. ఈ విషయంలో ఆర్పీఏ 1951లోని 123 బీ నిబంధనలను కేంద్రం ఉల్లంఘించింది’ అని ఒవైసీ పేర్కొన్నారు.