Tomato | బెంగళూరు : దేశ వ్యాప్తంగా టమాటా రేట్లు భగభగ మండిపోతున్న సంగతి తెలిసిందే. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు ఉంది. కిలో టమాటా ధర రూ. 120 నుంచి రూ. 180 దాకా పలుకుతోంది. ఈ నేపథ్యంలో టమాటా పండించే రైతులు తమ పంటలకు పటిష్టమైన పహారా ఏర్పాటు చేసుకున్నారు. అయినప్పటికీ దొంగలు మాత్రం దోచుకుంటున్నారు. కర్ణాటకలో రూ. 2.5 లక్షల విలువ చేసే టమాటాను దొంగలు చోరీ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. హసన్ జిల్లా పరిధిలోని గోని సోమనహళ్లి గ్రామానికి చెందిన మహిళా రైతు ధరణి.. తనకున్న రెండు ఎకరాల పొలంలో టమాటా పంటను వేసింది. కాపు కూడా బాగా కాసింది. ప్రస్తుతం కర్ణాటకలో కిలో టమాటా ధర రూ. 120 పైనే పలుకుతోంది. దీంతో తమకు కాసుల వర్షం కురిసినట్టే అనుకుని ధరణి భావించింది. రేపోమాపో టమాటాను తెంచి, బెంగళూరుకు తరలించాలని ఆమె ప్లాన్ చేసుకుంది. కానీ మంగళవారం రాత్రే టమాటా తోటలో దొంగలు పడ్డారు. 50 నుంచి 60 బ్యాగుల టమాటాను దొంగిలించారు. ఈ టమాటా విలువ రూ. 2.5 లక్షలు ఉంటుందని మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేసింది. మిగతా పంటను నాశనం చేశారని ఆమె తెలిపింది. బాధితురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.