న్యూఢిల్లీ : కరోనా టీకాల పంపిణీలో భారతదేశం 100 కోట్ల మార్క్ను దాటింది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా సంబురాలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి చేరుకుని హెల్త్ కేర్ వర్కర్స్తో మాట్లాడి అభినందించారు. కొవిడ్ టీకాల పంపిణీలో కీలక పాత్ర పోషించిన వైద్యారోగ్య సిబ్బందిపై మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. ఇదే సమయంలో ఓ దివ్యాంగురాలిని కూడా మోదీ దీవించారు.
రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో మోదీకి 25 ఏండ్ల ఛావీ అగర్వాల్(దివ్యాంగురాలు) తారసపడింది. దీంతో మోదీ అక్కడ ఆగి.. దివ్యాంగురాలితో పాటు ఆమె తల్లి పూనమ్ అగర్వాల్ను ఆప్యాయంగా పలుకరించారు. ఎందుకు వచ్చావని మోదీ ఆమెను ప్రశ్నించగా.. టీకా కోసమని చెప్పింది. ఇంత ఆలస్యంగా టీకా ఎందుకు తీసుకుంటున్నావని మోదీ అడగ్గా.. దగ్గు కారణంగా తీసుకోలేకపోయానని ఛావీ సమాధానం ఇచ్చింది.
నీ హాబీస్ ఏంటని మోదీ ప్రశ్నించగా.. పాటలు పాడటమంటే ఇష్టమని చెప్పింది. దీంతో ఒక పాట పాడాలని మోదీ ఆమెను కోరగా.. యే మేరే వతన్ కే లోగోన్ అనే పాటను ఆలపించింది ఛావీ. అనంతరం ఆమెను మోదీ దీవించి.. త్వరలోనే తప్పకుండా కలుస్తానని ఛావీకి మాటిచ్చారు. వ్యాక్సినేషన్ వంద కోట్ల మార్కు దాటిన రోజు ఛావీకి ప్రత్యేకమైంది. మోదీ ఆమెను పలుకరించి, మాట్లాడటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఛావీ పేర్కొన్నారు.