న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకు పెరుగుతున్న గాలి కాలుష్యం ఆందోళన కలిగిస్తున్నది. మరోవైపు గాలి నాణ్యత కోసం కోట్ల వ్యయంతో నిర్మించిన స్మాగ్ టవర్ (smog tower) నిరూపయోగంగా మారింది. దానికి తాళం వేసి ఉండటం విమర్శలకు తావిస్తున్నది. 2021లో ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్లో సుమారు రూ.23 కోట్ల వ్యయంతో నిర్మించిన స్మాగ్ టవర్ను సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎంతో ఆర్భాటంగా ప్రారంభించారు. 24 మీటర్ల పొడవైన స్మాగ్ టవర్ కిలోమీటరు వ్యాసార్థం పరిధిలో వెయ్యి క్యూబిక్ మీటర్ల గాలిని సెకనులో శుభ్రం చేసే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. 40 ఫ్యాన్లు, 5,000 ఎయిర్ ఫిల్టర్లతో కూడిన ఈ టవర్ కలుషిత గాలిని పీల్చుకుని ఫిల్టర్ చేసిన గాలిని విడుదల చేస్తుందని భావించారు. ఢిల్లీలో అత్యంత కాలుష్య ప్రాంతమైన ఆనంద్ విహార్లో కూడా మరో స్మాగ్ టవర్ను ప్రారంభించారు.
కాగా, కన్నాట్ ప్లేస్లో ప్రయోగాత్మకంగా నిర్మించిన స్మాగ్ టవర్ ప్రస్తుతం నిరూపయోగంగా మారింది. రెండేళ్ల పాటు నిర్వహణలో 100 మీటర్ల దూరంలో పర్టిక్యులేట్ మేటర్ (పీఎం) తగ్గింపు కేవలం 12 శాతం నుంచి 13 శాతం మాత్రమే ఉందని గుర్తించారు. స్మాగ్ టవర్ సామర్థ్యం చాలా తక్కువగా ఉన్నట్లు దీనికి రూపకల్పన చేసిన ఐఐటీ బాంబే స్టడీలో తేలింది.
మరోవైపు రూ.23 కోట్ల వ్యయంతో నిర్మించిన స్మాగ్ టవర్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ టవర్ను మూసివేయాలని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డీపీసీసీ) సూచించింది. దీంతో ఈ టవర్ నిర్వహణకు సంబంధించిన ఇంజినీర్లు, ఆపరేటర్లు, సిబ్బందితో సహా పది మందిని ఏడు నెలల కిందట తొలగించారు. నాటి నుంచి ఈ స్మాగ్ టవర్కు తాళం వేసి మూసేశారు.