న్యూఢిల్లీ, నవంబర్ 5: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకొంటే జైల్లో ఉన్న తమ నేతను విడుదలచేస్తామని బీజేపీ ఆఫర్ ఇచ్చిందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బాంబు పేల్చారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించారు. ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ను ఈడీ జైల్లో పెట్టిన విషయం తెలిసిందే. లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై కూడా సీబీఐ కేసు నమోదుచేసింది.
గుజరాత్ ఎన్నికల్లో పోటీచేయకుండా తప్పుకొంటే వీరిద్దరిపై ఉన్న కేసులన్నింటినీ మాఫీ చేస్తామని బీజేపీ ఆఫర్ ఇచ్చినట్టు కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆ ఆఫర్ ఎవరు ఇచ్చారన్న ప్రశ్నకు బీజేపీ ఇలాంటి ఆఫర్లు ఎప్పుడూ నేరుగా ఇవ్వదని తెలిపారు. ఆప్ నేతల ద్వారానే తనకు సమాచారం ఇచ్చారని చెప్పారు. పార్టీ మారితే ముఖ్యమంత్రిని చేస్తామని సిసోడియాకు ముందుగా ఆఫర్ ఇచ్చారని, ఆయన దాన్ని తిరస్కరించటంతో గుజరాత్ ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని తనకు రాయబారం పంపారని వివరించారు. గుజరాత్తోపాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) ఎన్నికల్లో కూడా బీజేపీ ఓడిపోబోతున్నదని పేర్కొన్నారు.