న్యూఢిల్లీ : రానున్న లోక్సభ ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోదీ సర్కార్ కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను రాజకీయ ప్రత్యర్ధులపై ప్రయోగిస్తోంది. ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులతో దాడులు, సోదాలతో ప్రత్యర్ధి పార్టీల్లో అలజడి రేపుతోంది. రాజకీయ ప్రత్యర్ధులు తమ దారికి రాకుంటే కేంద్ర దర్యాప్తు ఏజెన్సీల దాడులతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విమర్శలను హుందాగా స్వీకరించలేని కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్ధలను దుర్వినియోగం చేయడం విమర్శల పాలవుతున్నది.
దర్యాప్తు ఏజెన్సీలను ఈస్ధాయిలో పాలకపక్షం ఎడాపెడా ప్రత్యర్ధులపై ఉసిగొల్పడం ఇంతకుముందెన్నడూ లేదని రాజకీయ పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇక లేటెస్ట్గా టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్లో తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఆయన భార్యకు ఈడీ నోటీసులు జారీ చేయగా, అంతకుముందు చైనా నుంచి నిధులు సమకూరుతున్నాయంటూ న్యూస్క్లిక్పై దాడులు జరిపి న్యూస్పోర్టల్ ఫౌండర్, హెచ్ఆర్ హెడ్ను అరెస్ట్ చేశారు. మరోవైపు బుధవారం ఉదయం ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో ఈడీ దాడులు చేపట్టింది. ఆప్ ఎంపీ ఇంటిపై దాడుల విషయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఓటమి తప్పదనే నైరాశ్యంతో బీజేపీ ఇలాంటి చర్యలకు తెగబడుతోందని దుయ్యబట్టారు. ఇలాంటి దాడులు ఎన్నో జరుగుతాయి..అయినా తాము వీటికి భయపడేదిలేదని అన్నారు.
మనీల్యాండరింగ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంపై ఈడీ బుధవారం ఉదయం దాడులు చేపట్టింది. ఈ కేసుకు సంబంధించిన ఇతరుల నివాసాలపైనా దర్యాప్తు సంస్ధ సోదాలు చేపట్టింది. గత ఏడాదిగా లిక్కర్ స్కామ్లో విచారణ సాగిస్తున్నా ఇప్పటివరకూ ఏమీ దొరకలేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. సంజయ్ సింగ్ ఇంట్లో కూడా ఈడీకి ఏమీ లభించలేదని అన్నారు. ఓటమి భయం వెంటాడేవారే ఇలాంటి చర్యలకు పాల్పడతారని వ్యాఖ్యానించారు. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ ఈ తరహా దాడులు పెరుగుతాయని, ఎన్నికల సమయంలో ఈడీ, సీబీఐ, ఐటీ, పోలీసులు సహా అన్ని ఏజెన్సీలు చురుకుగా మారతాయని ఎద్దేవా చేశారు. నిన్న జర్నలిస్టులను టార్గెట్ చేస్తే ఇవాళ సంజయ్ సింగ్ రేపు మరెన్నో దాడులు జరుగుతాయని అయినా తాము భయపడబోమని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
Read More :
MLC Kadiam Srihari | ప్రధాని మోదీ నీచ స్థాయికి దిగజారి మాట్లాడారు : ఎమ్మెల్సీ కడియం శ్రీహరి