Arvind Kejriwal : కొవిడ్-19 థర్డ్ వేవ్, ఒమిక్రాన్ వేరియంట్ నుంచి ఎదురయ్యే ముప్పులను ఎదుర్కొనేందుకు ఢిల్లీ సన్నద్ధంగా ఉందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. మూడో ముప్పు ఎదురైతే రోజుకు లక్ష కేసులు వెలుగుచూసినా ఆ పరిస్ధితిని ఎదుర్కొనేందుకు ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రోజూ మూడు లక్షల టెస్టులు నిర్వహించే సామర్ధ్యాన్ని కలిగిఉన్నామని తెలిపారు.
ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందితే కట్టడి చేసే ఉద్దేశంతో ఢిల్లీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిందని స్పష్టం చేశారు. రాబోయే నెలలకు మందులను నిల్వ చేయడంతో పాటు సిబ్బంది సంఖ్యను పెంచుతున్నామని చెప్పారు. రాబోయే మూడు వారాల్లో 15 ఆక్సిజన్ ట్యాంకర్లు అందుబాటులోకి రానున్నాయని కేజ్రీవాల్ తెలిపారు.
స్వల్ప లక్షణాలున్న వారు ఇండ్ల వద్దే చికిత్స తీసుకోవాలని ఆస్పత్రుల్లో చేరేందుకు తొందరపడవద్దని రోగులకు విజ్ఞప్తి చేశారు. హోం ఐసోలేషన్ మాడ్యూల్ను మెరుగుపరుస్తున్నామని, ఆరోగ్య కార్యకర్తలు రోగులను వారి ఇండ్ల వద్దే కలుస్తారని, టెలికౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు ఆక్సీమీటర్లతో కూడిన కిట్స్ను అందిస్తారని చెప్పారు.