మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మద్యం జోలికి వెళ్లొద్దని నేను ఆయనకు చాలా సార్లు చెప్పాను. కానీ మరింత మనీ కోసం మద్యం పాలసీ తెచ్చారు’ అని అన్నా హజారే చెప్పారు. అవినీతి కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావడం ఆయన స్వయంకృతం అని వ్యాఖ్యానించారు.
అవినీతి వ్యతిరేక ‘జన్ లోక్పాల్’ ఉద్యమంలో భాగమైన ఆయనే ఇప్పుడు అవినీతి కేసులో అరెస్ట్ కావడం విడ్డూరం అని పేర్కొన్నారు. కోట్ల మంది ప్రజలకు నమ్మకద్రోహం చేశాయన్నారు. 2011 నాటి ఉద్యమాన్ని ఆయన రాజకీయ ఆశయాలు నాశనం చేశాయన్నారు. ఈ కేసులో సమగ్ర విచారణ జరిపించి దోషులను శిక్షించాలని ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
‘ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం బాధగా ఉంది. ఒకనాడు అవినీతి వ్యతిరేక పోరాటంలో నా సహచరుడు ఇప్పుడు అవినీతి కేసులోనే అరెస్ట్ కావడం విడ్డూరం. ‘జన్ లోక్ పాల్’ రాజకీయ ప్రత్యామ్నాయం విఫలం కావడం దురదృష్టకరం. రాజకీయ ఆకాంక్షల వల్లే అవినీతి వ్యతిరేక ఉద్యమం నాశనమైంది’ అని కేజ్రీవాల్ పై అన్నా హజారే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం రాత్రి అరెస్టయిన కేజ్రీవాల్కు న్యాయస్థానం వారం రోజుల ఈడీ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే.