ఇటానగర్ : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం.. మౌంట్ ఎవరెస్ట్ను అరుణాచల్ ప్రదేశ్కు చెందిన యువతి తషి యాంగ్జోమ్ అధిరోహించింది. ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కిన తషికి ఆ రాష్ట్ర గవర్నర్ బ్రిగేడియర్ బీడీ మిశ్ర, సీఎం పెమా ఖందూలు కంగ్రాట్స్ తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ కూతుళ్లు ధైర్యసాహసాలకు, విరోచిత అన్వేషణలకు ప్రేరణగా నిలుస్తారని గవర్నర్ అన్నారు. తషిని చూసి యువత ప్రేరణ పొందుతుందన్నారు. దిరాంగ్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ అండ్ అలైడ్ స్పోర్ట్స్లో తషి యాంగ్జోమ్ శిక్షణ పొందింది. నిమాస్లో ఆమె ఇన్స్ట్రక్టర్గా కూడా చేస్తోంది. పర్వతారోహణ కోసం ఆ ఇన్స్టిట్యూట్లో అనేక మంది శిక్షణ పొందుతున్నారు.
ఈ సీజన్లో మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిన తొలి భారతీయ మహిళ తషి యాంగ్జోమ్ అని అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖందూ తెలిపారు. నిమాస్ శిక్షణ కేంద్రం నుంచి మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిన తొమ్మిదొవ క్లైంబర్గా ఆమె నిలిచారు. మే 11వ తేదీన ఉదయం 6 గంటలకు తషి యాంగ్జోమ్.. మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించినట్లు నిమాస్ డైరక్టర్ కల్నల్ సర్ఫరాజ్ సింగ్ తెలిపారు. అరుణాచల్లోని వెస్ట్ కమాండ్ జిల్లాలోని దిరాంగ్ సర్కిల్లో ఉన్న లుబ్రాంగ్ గ్రామానికి ఆ యువతి చెందినది.